ముస్లిం యువకుడి హత్య: శివాలయం పూజలు నిలిపివేత
తిరువనంతపురం: మానవత్వానికి మతంతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. ఇటీవల దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముస్లిం యువకుడు షబ్బీర్(23)కు నివాళిగా స్థానిక శివాలయం అధికారులు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ఉదంతం వారిని అభినందించేలా చేసింది.
ఓ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నేపథ్యంలో కొందరు దుండగులు షబ్బీర్ను ఇటీవల కర్రలతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మృతుడు షబ్బీర్కు సంబంధించి మరో కోణం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. షబ్బీర్ అత్తింగల్ సమీపంలోని పుత్తెన్నడ శివాలయానికి సంబంధించిన వార్షిక ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనేవాడట. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్సవాల నిర్వహణలో నిబద్ధతతో పనిచేసేవాడట. ఈ క్రమంలో షబ్బీర్ అకాల మరణ వార్త విన్న అలయ అధికారులు హతాశులయ్యారు.
అతని మృతికి సంతాపం తెలుపుతూ సదరు ఆలయంలో రెండురోజులపాటు అన్ని పూజలను నిలిపివేయాలని దేవస్థాన పాలక కమిటి నిర్ణయించింది. గుడిలో దీపం వెలగొద్దు, గుడి గంట మోగవద్దని తీర్మానించారు.
దీంతో గడిచిన సోమ, మంగళవారాల్లో దీపారాధాన, తీర్థప్రసాదాలను నిలిపివేశారు. రోజుకు ఐదు రకాల పూజలు నిర్వహించే దేవాలయంలో ముస్లిం యువకునికి గౌరవ సూచకంగా రెండు రోజుల పాటు పూజలు నిలిపివేయడం విశేషంగా నిలిచింది.