శబరిమల ఆలయంలోకి ప్రవేశిస్తానని మహిళ పోస్ట్, ఇంటిని చుట్టుముట్టారు
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశిస్తానని ఓ మహిళ చెప్పడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఈ సంఘటన కేరళలో జరిగింది. తాను శబరిమల గర్భగుడిలోని పద్దెనిమిది మెట్లు ఎక్కుతానని ఓ మహిళా టీచర్ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇది వివాదానికి దారి తీసింది.
రేష్మా నిషాంత్ అనే మహిళ ఆలయంలోకి వెళ్తానని ప్రకటించారు. ఆమె అలా ప్రకటించిన విషయం తెలిసి ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆలయంలో వెళ్లకుండా అడ్డుకుంటామని చెప్పారు. పదేళ్ల నుంచి యాభై ఏళ్ల వయస్సు గల మహిళలు శబరిమల ఆలయానికి వెళ్లవచ్చని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. అయితే పలు కారణాల వల్ల దీనిని పురుషులతో పాటు మహిళలు కూడా వ్యతిరేకిస్తున్నారు.
ఓ ధర్మంలోనికి వచ్చి తీర్పు చెప్పడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. మహిళలకు అందరికీ నిరాకరించడం లేదు. పదేళ్ల లోపు, అరవై ఏళ్ల పైబడిన మహిళలు రావొచ్చు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. దీనిపై కేరళలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది.

ఈ సమయంలో రేష్మా గుళ్లోకి వెళ్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత కలకలం రేపింది.ఇందులో విప్లవం ఏమీ లేదని, ఒక భక్తురాలు ముందడుగు వేసి మరింత మందిలో ఆలయాన్ని దర్శించాలన్న ధైర్యాన్ని కలిగిస్తుందని ఆమె పేర్కొంది. రుతుక్రమం శరీరంలో చోటుచేసుకొనే ఇతర చర్యల లాంటిదేనని అభిప్రాయపడింది.
తాను గత పన్నెండేళ్లుగా మండల కాలాన్ని పాటిస్తున్నాని మీడియాకు చెప్పారు. కానీ శబరిమలలోకి మాత్రం తనకు ఇంతవరకు ప్రవేశం లభించలేదన్నారు. అయితే పురుషులు 41 రోజులు పాటు మండల కాలాన్ని పాటిస్తుండగా రుతుక్రమం కారణంగా తాను 55 రోజుల పాటు పాటిస్తున్నానని ఆమె తెలిపింది. కాగా, భక్తుల కోసం బుధవారం నుంచి శబరిమల ద్వారాలు తెరుచుకోనున్నాయి.












Click it and Unblock the Notifications