38వ జీఎస్టీ సమావేశం నేడే : ఆర్ధిక మందగమనం దృష్ట్యా కీలక చర్చలు, సమీక్షలు
Recommended Video
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 38వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుంది. నేడు ఢిల్లీలో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సారి భేటీలో ఆర్ధిక మందగమన పరిస్థితుల దృష్ట్యా పలు కీలక అంశాలపై చర్చ , సమీక్ష చెయ్యనున్నారు.
బాగా తగ్గిన జీఎస్టీ ... ఆర్ధిక మందగమనం ఎఫెక్ట్
దేశవ్యాప్తంగా ఊహించిన దానికన్నా తక్కువ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు రావడం, రాష్ట్రాలకు నష్టపరిహారాల చెల్లింపులో జాప్యం జరగటంతో వీటికి గల కారణాలపై సమీక్షించేందుకు జీఎస్టీ మండలి నేడు సమావేశం కానుంది. ఆర్ధిక మందగమనం ఎఫెక్ట్ జీఎస్టీ వసూళ్ళలో సైతం ఈ సారి తీవ్రంగా కనిపించింది. వివిధ వస్తువులపై జీఎస్టీ వడ్డింపు అలాగే ఆదాయాన్ని పెంచేందుకు అనుసరించాల్సిన విధానాలపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కోరింది కేంద్ర ఆర్థిక శాఖ.
ఆదాయాన్ని పెంచేందుకు కొన్ని వస్తువులపై పన్నులు పెంచే యోచన
ఆదాయ కొరత, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహం, ఎగుమతిదారులకు వాపసు, లాటరీలపై పన్ను రేట్లు వంటి కీలక అంశాలపై చర్చించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని వస్తు, సేవా పన్ను (జిఎస్టి) కౌన్సిల్ ఈ రోజు సమావేశంలో చర్చించనున్నారు . రాష్ట్రాలు మరియు కేంద్రాల మధ్య ఆదాయ సేకరణను సమతుల్యం చేసే చర్యలను కూడా కౌన్సిల్ నేడు తీసుకోనుందని సమాచారం . అంతేకాకుండా, కౌన్సిల్ కొన్ని వస్తువులపై 2 శాతం సెస్ విధించవచ్చు, అవి 5-18 శాతం పన్ను స్లాబ్స్ పరిధిలోకి వస్తాయి.
కేంద్రం అంచనాకు అందనంత దూరంలో ఆగిపోయిన జీఎస్టీ వసూళ్లు
ఈ ఆర్థిక సంవత్సరం 2019-20 ఏప్రిల్-నవంబర్ కాలానికి గాను రూ.3,28,365 కోట్ల జీఎస్టీ వసూలు అయ్యింది . అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఇదే ఏప్రిల్ నుండి నవంబర్ వరకు గాను రూ. 5,26,000 కోట్ల మేర జీఎస్టీ వసూళ్ళు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అంచనాకన్నా తక్కువగా జీఎస్టీ వసూళ్లు రావడంతో దేశవ్యాప్తంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లలో వృద్ధి సాధించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఉన్నతాధికారులతో కేంద్ర రెవెన్యూ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు.
జీఎస్టీ వసూళ్ల క్షీణతపై దృష్టి సారించనున్న కేంద్రం
ఈ పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అన్న దానిపై ముఖ్యంగా చర్చ జరిగే అవకాశం ఉంది. జీఎస్టీ వసూళ్ల క్షీణతపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు జీఎస్టీ క్షీణతకు కారణంగా తెలుస్తుంది. అయితే దేశంలో నెలకొన్న ఆర్ధిక మందగమనం వల్ల మరలా ఎలాంటి కొత్త పన్నులు, సుంకాలు విధించకూడదంటూ బెంగాల్ సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్కు లేఖ కూడా రాశారు.
సమావేశానికి ఢిల్లీ చేరుకున్న తెలంగాణా ఆర్ధిక మంత్రి హరీష్ రావు
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.మొన్నటికి మొన్న జీఎస్టీ చెల్లింపుల కోసం పార్లమెంట్ సభ్యులు ఆందోళన చేశారు. తెలంగాణకు జీఎస్టీలో రావాల్సిన నష్టపరిహారాన్ని, జీఎస్టీ నిధుల మళ్లింపు అంశాన్ని మంత్రి హరీష్ రావు లేవనెత్తే అవకాశముంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో భేటీ కానున్న జీఎస్టీ కౌన్సిల్ ప్రస్తుత దేశ ఆర్ధిక స్థితిగతుల దృష్ట్యా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.