భారత్-అమెరికా బంధంలో సరికొత్త మలుపు: సమగ్ర వాణిజ్య ఒప్పంద రోడ్మ్యాప్ ఖరారు - జేడీ వాన్స్ ప్రకటన
అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు సరికొత్త మలుపు తిరిగాయి. రెండు దేశాల మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందం దిశగా కీలక అడుగులు పడ్డాయి. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన భేటీ అనంతరం ఈ శుభవార్తను ప్రకటించారు. ఇరు దేశాల వాణిజ్య చర్చలకు అవసరమైన రోడ్మ్యాప్ను అధికారికంగా ఖరారు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - భారత ప్రధాని మోదీ దార్శనికతను వాస్తవరూపంలోకి తీసుకురావడంలో అత్యంత కీలకమైన ముందడుగు అని జేడీ వాన్స్ అభివర్ణించారు.
జైపుర్లో జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు:
రాజస్థాన్ రాజధాని జైపుర్లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న జేడీ వాన్స్, భారత్తో అమెరికా బంధం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. "వాణిజ్య చర్చలకు సంబంధించిన నిబంధనలను అమెరికా, భారత్ అధికారికంగా ఖరారు చేశాయి. ఇది మన రెండు దేశాల మధ్య భవిష్యత్ వాణిజ్య ఒప్పందానికి స్పష్టమైన రోడ్మ్యాప్గా ఉపయోగపడుతుంది" అని ఆయన అన్నారు.

తమ పర్యటన కేవలం సంబంధాలను బలోపేతం చేసుకోవడానికే తప్ప, భారత్కు పాఠాలు చెప్పడానికి కాదని వాన్స్ స్పష్టం చేశారు. గతంలో కొన్ని అమెరికా ప్రభుత్వాలు భారత్ను తక్కువ వేతనాలకు కార్మికులను అందించే దేశంగా చూసి, విమర్శలు చేసేవని పరోక్షంగా వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, అమెరికా, భారత్ రెండూ తమ శ్రామిక శక్తిని గౌరవించే భాగస్వాములని ఆయన పేర్కొన్నారు.
మోదీ ప్రజాదరణకు వాన్స్ ఫిదా:
భారత ప్రజాస్వామ్యం, ప్రధాని మోదీ నాయకత్వాన్ని జేడీ వాన్స్ విశేషంగా ప్రశంసించారు. "ప్రజాస్వామ్య ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వం ఇదేనని అన్నారు. ప్రధాని మోదీకున్న ప్రజామోద రేటింగ్లు నిజంగా నాకు అసూయ కలిగించేలా ఉన్నాయి. ఈ విషయాన్ని నేరుగా మోదీ వద్దే ప్రస్తావించాను" అంటూ తన ఆశ్చర్యాన్ని, ప్రశంసను వ్యక్తం చేశారు.
భారత్ సంస్కృతి, భవిష్యత్ దార్శనికతపై ప్రశంసలు:
జైపుర్ పర్యటనలో భాగంగా జేడీ వాన్స్ దంపతులు అంబర్ కోటను సందర్శించి, అక్కడి అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డారు. భారత్ చరిత్ర, సంప్రదాయాలకు గొప్ప నిలయమని, భవిష్యత్తు పట్ల దేశానికున్న దార్శనికత మెచ్చుకోదగినదని వాన్స్ కొనియాడారు. అభివృద్ధి చెందడానికి భారత్లో ఎన్నో అపారమైన అవకాశాలున్నాయని, ఏదో సాధించాలనే తపన, పట్టుదల భారతీయుల్లో అధికంగా ఉందని ఆయన కొనియాడారు.
ట్రంప్ ఆకాంక్ష.. ఉమ్మడి వృద్ధి:
డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షను జేడీ వాన్స్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. "అమెరికాతో పాటు భారత్ కూడా అభివృద్ధి చెందాలని డొనాల్డ్ ట్రంప్ బలంగా కోరుకుంటున్నారు. మన రెండు దేశాల భాగస్వామ్యం మరింత వృద్ధి చెందాలన్నదే ట్రంప్ ఆకాంక్ష" అని ఆయన తెలిపారు. ఇది కేవలం వాణిజ్యం మాత్రమే కాదని, ఇరు దేశాల ఉమ్మడి వృద్ధికి, బంధం బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పరోక్షంగా సూచించారు.
టారిఫ్ల నేపథ్యంలో.. చర్చలకు బాటలు:
ఈ చర్చల ప్రకటన వెనుక ఇటీవల డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల అంశం కీలకమైంది. అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై కనీసం 10% సుంకం విధించాలని, భారత్ తమ ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, తాము 26% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు తగిన సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో, ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేస్తూ ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు వేగవంతం అవుతాయని, ఒప్పందం దిశగా అడుగులు పడతాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు జేడీ వాన్స్ ప్రకటనతో ఆ అంచనాలు నిజమయ్యాయి. ఖరారైన రోడ్మ్యాప్తో, త్వరలోనే ఇరు దేశాల మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇది అమెరికా-భారత్ ఆర్థిక సంబంధాల్లో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications