అందిన ఐరాస లేఖ: దేవయానికోసం రూల్స్ మార్చారా?
న్యూఢిల్లీ: భారత దౌత్యకారిణి దేవయానిని ఐక్యరాజ్య సమితికి బదలీ చేసిన నేపథ్యంలో తాము వ్రాత పని చేస్తున్నామని అమెరికా ప్రతినిధి ఒకరు చెప్పారు. దేవయాని బదలీపై తమకు ఐక్యరాజ్య సమితి నుండి శుక్రవారం రాత్రి లేఖ అందిందని, దానిని సమీక్షిస్తున్నామన్నారు.
కాగా, వివాదాస్పద ఆదర్శ్ సొసైటీలో ఫ్లాట్ సహా దేవయానికి మొత్తం పదకొండు ఆస్తులు ఉన్నాయని విదేశాంగ శాఖకు ఆమె సమర్పించిన ఆస్తుల రిటర్నులు చెబుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆదర్శ్ సొసైటీలో ఫ్లాటు కొనేటప్పటికే కొంత భూమి సహా ఏడు ఆస్తులు ఆమెకు తన తండ్రి ఉత్తమ్ నుంచి వారసత్వ ఆస్తిగా సంక్రమించాయట.
మరోవైపు దేవయాని తండ్రికున్న పలుకుబడి వల్ల ఆమె కోసం ఏకంగా విదేశాంగ శాఖ నిబంధనలే మారిపోయాయట. ఐఎఫ్ఎస్ అధికారులు తమ శిక్షణలో ఏదైనా ఒక విదేశీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి. శిక్షణ సమయంలో వారి ప్రతిభను బట్టి గ్రేడ్లు కేటాయిస్తారు. వచ్చిన గ్రేడ్ల ఆధారంగా వారు ఎంచుకున్న ఆప్షన్లను బట్టి వారు నేర్చుకోవాల్సిన భాషను అధికారులే నిర్ధారిస్తారు.
కానీ, దేవయాని ఈ సర్వీసుకు ఎంపికైన 1999లో విదేశీ భాష కేటాయింపు నిబంధనల్లో మార్పు చేశారు. ఆ బ్యాచ్కు చెందిన మహావీర్ సింఘ్వీ అనే అధికారికి ఐదో గ్రేడ్ రాగా దేవయానికి ఏడో గ్రేడ్ వచ్చింది. సింఘ్వీ, దేవయాని ఇద్దరూ తమ తొలి ప్రాథమ్యంగా జర్మన్ భాషనే ఎంచుకున్నారు.
నిబంధనల ప్రకారం సింఘ్వీకే జర్మన్ భాషను కేటాయించాల్సి ఉన్నా, వాటిని తోసిరాజని అధికారులు దేవయానికి జర్మన్, సింఘ్వీకి స్పానిష్ భాషలను కేటాయించారు. ఈ వివాదం చివరకు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. సుప్రీం సింఘ్వీకి అన్యాయం చేశారంటూ ప్రభుత్వానికి తలంటింది.