గౌరీ లంకేష్కు పట్టిన గతే పట్టిస్తాం: జర్నలిస్ట్ సాగరికా ఘోష్కు బెదిరింపులు
ఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలోని గౌరీ లంకేష్ను హత్య చేసిన తరహలోనే తనను హతమార్చేందుకు కొందరు దుండగులు బెదిరిస్తున్నారని ఢిల్లీకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు .తనను దేశ వ్యతిరేకిగా పేర్కొంటూ... హతమార్చాల్సి ఉందంటూ ఫేస్బుక్ ద్వారా బెదిరింపు వచ్చిందని సాగరికా ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విక్రమాదిత్య రాణా అనే వ్యక్తి ఈ పోస్టింగ్ చేసినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఐ.పి. చిరునామా సహా వివరాలను ఆరా తీస్తున్నారు పోలీసులు. 'పాత్రికేయులుగా, ఉద్యమకారులుగా ముసుగులు వేసుకున్న దేశ వ్యతిరేకులకు గౌరీ లంకేశ్ కాల్చివేత ఒక ఉదాహరణగా నిలవాలి. ఇదే చివరి ఘటన కాకూడదని నేను ఆశిస్తున్నాను. దేశవ్యతిరేకులందరినీ వరసగా ఇలాగే హతమార్చాలంటూ ఈ బెదిరింపుకు పాల్పడ్డాడు.
శోభా డే, అరుంధతీ రాయ్, సాగరికా ఘోష్, కవితా కృష్ణన్, షీలా రషీద్ తదితరులంతా ఈ జాబితాలో ఉంటారు. ఒక హిట్లిస్ట్ రూపొందించి, దానిలో ఉన్నవారందరినీ హతమార్చాలి' అని దానిలో పేర్కొన్నారు. దీని గురించి సాగరికా ఘోష్ ట్విటర్లో వెల్లడించగానే దిల్లీ పోలీసులు రంగంలో దిగి, కేసు నమోదు చేశారు.
52 ఏళ్ల సాగరికా ఘోష్ గత రెండున్నర దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో ఉన్నారు. ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ని ఆమె 1994లో వివాహం చేసుకున్నారు. అవుట్లుక్, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి పత్రికల్లో పనిచేశారు. ఈటీ నౌ టీవీ ఛానెల్లో వార్తా ప్రయోక్తగా సేవలందించారు.
ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియాలో కన్సల్టింగ్ ఎడిటర్గా ఉన్నారు. 'ది జిన్ థింకర్స్', 'బ్లైండ్ ఫెయిత్' అనే రెండు నవలల్ని రాశారు. ఇటీవలే ఇందిరాగాంధీపై మరో నవల రాశారు. ఘోష్ తండ్రి భాస్కర్ ఘోష్ విశ్రాంత ఐఏఎస్ అధికారి.