కిమ్ భార్య కనిపించారు: గతేడాది అదృశ్యం తర్వాత మళ్లీ ఇప్పుడే?
ఎప్పుడూ మీడియాలో కనిపించని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ సతీమణి రి సోల్ జు తాజాగా ఓ విందు కార్యక్రమంలో మీడియా కెమెరాలకు చిక్కారు.
విజయవాడ: ఎప్పుడూ మీడియాలో కనిపించని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ సతీమణి రి సోల్ జు తాజాగా ఓ విందు కార్యక్రమంలో మీడియా కెమెరాలకు చిక్కారు. చాలా నెలల నుంచి ఆమె కనిపించకుండా పోవడంతో.. రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.
ఉత్తరకొరియా 'పండగ' చేసుకుంది: క్షిపణి 'సక్సెస్'తో పార్టీ మూడ్లో కిమ్
కొంతమందైతే అధ్యక్షుడే ఆమెను చంపేసి ఉంటాడన్న అనుమానాలు వెలిబుచ్చారు. తన సోదరితో విభేదాల కారణంగానే రి సోల్ జును కిమ్ హత్య చేసి ఉంటాడన్న ప్రచారం జరిగింది. తాజాగా భర్తతో కలిసి ఆమె విందు కార్యక్రమానికి హాజరవడంతో.. ఈ ప్రచారానికి తెరపడినట్లయింది.
'క్షిపణి' సక్సెస్ వేడుకలు:
కాగా, ఇటీవల అమెరికా స్వాతంత్ర్య దినోత్సవమైన జులై 4న ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రయోగం విజయవంతం కావడంతో కిమ్ పార్టీ మూడ్ లో మునిగి తేలుతున్నారు. జాతి విజయంగా కీర్తిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పాప్ స్టార్లతో ప్రదర్శనలతో పాటు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భార్య రి సోల్ జుతో కలిసి ఆయన హాజరవడం హాట్ టాపిక్ గా మారింది.
అధ్యక్షుల భార్యలు అంతే!
ఇదిలా ఉంటే, కిమ్ తండ్రి, తాతలు అధ్యక్షులుగా ఉన్న కాలంలోను వారి సతీమణులు అసలు బయటి జనాలకు కనిపించకపోయేవారట. అంతో ఇంతో కిమ్ జాన్ భార్య మాత్రమే అడపా దడపా మీడియా ముందుకు వస్తున్నారు. అయితే గతేడాది నుంచి రి సోల్ జు కనిపించకపోవడంతో ఆమె అదృశ్యంపై రకరకాల వదంతులు వ్యాపించాయి.
సేఫ్ ప్లేస్లో!:
ప్యాంగ్యాంగ్ లో నెలకొన్న రాజకీయ అస్థిరతతో పాటు పలు దాడులు చోటు చేసుకోవడంతో.. భద్రతా కారణాల రీత్యా భార్య రి సోల్ జు ను అధ్యక్షుడు కిమ్ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారని అప్పట్లో టోక్యోలోని వసేదా యూనివర్సిటీ ప్రొఫెసర్ తోషిమిత్సు షిగెమురా అభిప్రాయపడ్డారు.
గర్భవతి అయిందన్న ప్రచారం:
రి సోల్ జు గర్భవతిగా ఉన్న కారణంతోనే ఆమెను అధ్యక్షుడు బయటకు రానివ్వడం లేదన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కాగా, 2012లో రి సోల్ జు ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీనిపై అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో.. ఇందులో నిజనిజాలెంతో అక్కడివారికే తెలియడం లేదు. రి సోల్ జు ప్రజలకు ముందుకు వస్తేనే ఈ అనుమానాలకు తెర పడుతుందని భావిస్తున్న తరుణంలో.. ఆమె విందు కార్యక్రమానికి హాజరవడం గమనార్హం.