టీపై సోనియాకు చిక్కులు: కిరణ్ రెడ్డికి మైలేజీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధిక్కారంతో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చిక్కుల్లో పడినట్లే భావిస్తున్నారు. తాజాగా ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన మౌనదీక్ష కాంగ్రెసు అధిష్టానాన్ని ఇరకాటంలో పడేసింది. కాంగ్రెసు పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి విభజనను వ్యతిరేకిస్తుంటే, కాంగ్రెసు పార్టీలోనే ఏకాభిప్రాయం లేకపోతే తాము ఎలా సహకరిస్తామనే పద్ధతిలో బిజెపి నాయకులు మాట్లాడుతున్నారు. దాదాపుగా ఇవే మాటలను లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ బుధవారంనాడు అన్నారు.
దానికితోడు, మంగళవారం రాత్రి వార్ రూంలో అధిష్టానం పెద్దలు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో నిర్వహించిన సమావేశం కూడా ఫలితం ఇచ్చినట్లు కనిపించడం లేదు. తెలంగాణ బిల్లుపై సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను ఒప్పించడంలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, జివోఎం సభ్యుడు జైరాం రమేష్ విఫలమయ్యారు.

పార్లమెంటు సజావుగా నడిస్తేనే తాము సహకరిస్తామనే పద్ధతిలో బిజెపి వ్యవహరిస్తుండడం కాంగ్రెసు అధిష్టానానికి ఇబ్బందికరమేనని అంటున్నారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటామని తిరుగుబాటు పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ తదితరులు అంటున్నారు. తాము విభజనకు వ్యతిరేకం కాదంటూనే తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు వారికి సహకరిస్తున్నారు. తెలుగుదేశం పార్లమెంటు సభ్యుల గొంతు మాత్రం పెద్దగా వినిపించడం లేదు.
కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా పెద్ద దుమారమే రేపింది. అధిష్టానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ ఆయన కఠినమైన వ్యాఖ్యలే చేశారు. విభజనను అడ్డుకుంటామనే పద్ధతిలోనే ఆయన మాట్లాడుతున్నారు.
చంద్రబాబు నాయుడు బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు కూడగడుతుంటే, కిరణ్ కుమార్ రెడ్డి తమ పార్టీ అధిష్టానంపై తీవ్రమైన ఒత్తిడి పెడుతూ యుపిఎ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చేత అధిష్టానమే ఆడిస్తుందని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అంటున్నప్పటికీ బిజెపి జాతీయ నాయకులు మాత్రం కాస్తా కటువుగానే ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య నినాదంతో సీమాంధ్రలో పూర్తి స్థాయిలో ప్రయోజనం పొందాలనే ప్రయత్నాల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు సర్ది చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా వ్యవహరిస్తున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం వల్ల, సీమాంధ్రకు చెందిన కొంత మంది పార్లమెంటు సభ్యుల వల్ల తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చి ఆమోదం పొందుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తమ పని తాము చేసుకుపోతామని, తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని దిగ్విజయ్ సింగ్ మంగళవారం వార్ రూంలో అన్నట్లు వార్తలు వచ్చాయి. ఆటంకాలను అధిగమించి కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ బిల్లును ఎలా ఆమోదం జేస్తుందనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగే అవకాశాలే ఉన్నాయి.












Click it and Unblock the Notifications