విభజన: సిఎం కిరణ్ రెడ్డి తిరుగుబాటు, ఏం చేస్తారు?
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా గొంతు పెంచితే, కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు సిద్ధపడుతున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆయన అందుకు తగిన తేదీ కోసం చూస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఆయన రాజీనామా చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
రాష్ట్ర విభజనను శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి శనివారం కృష్ణా జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలోనూ అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన తీరు చూస్తుంటే తిరుగుబాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర విభజనపై జీవోఎం ప్రక్రియ తది దశకు చేరుకున్న తరుణంలో ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలూ తుది సమరానికి సిద్ధమవుతున్నారు. అధిష్ఠానం వద్ద తమ వాదన నెగ్గించుకోవడానికి వ్యూహరచనలు చేస్తున్నారు.

శుక్రవారం తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి నివాసంలో వీరంతా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్, భద్రాచలం, ఆదాయ పంపిణీ, నదీ జలాలు వంటి విషయాల్లో సీమాంధ్ర నేతలు తెస్తున్న ఒత్తిడిని తిప్పికొట్టాలని, ఇందుకు జీవోఎం సభ్యులను, అధిష్ఠానం పెద్దలను కలవాలని వీరు భావిస్తున్నారు. సోమవారం వరకు వరుసగా భేటీలు నిర్వహించి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని నిర్ణయించుకున్నారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం తర ఫున జీవోఎంకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పంపిన నివేదికకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం లేదని, కాబట్టి అది ప్రభుత్వ నివేదిక కాబోదని మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంపిన ఆ నివేదికను ముఖ్యమంత్రి నివేదికగానే పరిగణించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవోఎం సభ్యులకు, కేంద్ర పెద్దలకూ విన్నవిస్తామన్నారు.
విభజనకు సహకరించాలని అధిష్ఠానం గట్టిగా కోరే అవకాశముందని, మాట వినకపోతే రాజీనామా చేయాలని అధిష్ఠానం కోరితే ఏం చేయాలని ఆ నేతలను కిరణ్ కుమార్ రెడ్డిప్రశ్నించినట్లు సమాచారం. ధిక్కార స్వరాన్ని వినిపించినందుకు అధిష్ఠానం ఆగ్రహంతో ఉందని, తన పదవికి ముప్పున్నదన్న నిర్ధారణకు కిరణ్ వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే దాన్ని కూడా కిరణ్ కుమార్ రెడ్డి లెక్క చేయడం లేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తుది వరకూ పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన జివోఎం ముందు తన వాదనను గట్టిగా వినిపిస్తానని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు.
ఇదిలావుంటే, సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా పట్టుదలతోనే ఉన్నారు. 18న ఉదయం కేంద్ర మంత్రి పళ్లం రాజు నివాసంలో సమావేశం కావాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. విభజనను తీవ్రంగా అడ్డుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోరాదని, అదే జరిగితే రాజీనామాలకు పట్టుబట్టాలని ఎంపీలు డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ రాజీనామాలకు కేంద్రమంత్రులు సిద్ధపడకపోతే పార్లమెంట్ సమావేశాల తొలిరోజే రాజీనామాలకు పట్టుబట్టాలని ఎంపీలు నిర్ణయించుకోనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications