కొలీజియంలో మేమూ ఉంటాం..: సీజేఐకి కేంద్ర ప్రభుత్వం లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుల నియామకాల వ్యవహారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కేంద్ర ప్రభుత్వం ఇందులో సభ్యత్వాన్ని కోరుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీనియర్లు, ఎంపిక చేసిన న్యాయమూర్తులు మాత్రమే కాకుండా- తమకూ ఇందులో సభ్యత్వాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఫలితంగా- న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల విషయంలో కొలీజియం తీసుకునే నిర్ణయాలు, సిఫారసులను సమీక్షించడానికి అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
సాధారణంగా ఈ కొలీజియంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి ఛైర్మన్ హోదాలో కొనసాగుతుంటారు. ప్రస్తుతం సీజేఐ డీవై చంద్రచూడ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తోన్న కొలీజియంలో సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం షా, జస్టిస్ ముఖేష్ షా, జస్టిస్ అజయ్ రస్తోగి ఉన్నారు.
దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో సీనియర్ న్యాయవాదులకు న్యాయమూర్తులుగా ఎలివేషన్, న్యాయమూర్తుల బదిలీలు, వారిని సుప్రీంకోర్టులో అపాయింట్ చేయడం..ఇలాంటి కార్యకలాపాలన్నీ కొలీజయం పర్యవేక్షిస్తుంటుంది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫారసులు చేస్తుంటుంది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను దాదాపుగా కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదిస్తుంటుంది. ఈ సిఫారసులను తిప్పి పంపించిన సందర్భాలు తక్కువే.
అలాంటి కీలకమైన కొలీజియంలో సభ్యత్వాన్ని కోరుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. సీజేఐ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా తాము సూచించిన వారికి కొలీజియంలో సభ్యత్వాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వానికి భాగస్వామిని చేయాలని సూచించారు.
కొలీజియం చేసే సిఫారసులు మరింత మెరుగ్గా, పారదర్శకంగా ఉండాలనేదే తమ అభిప్రాయమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే- హైకోర్టు స్థాయిలో కొనసాగుతోన్న కొలీజియంలల్లో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధికి సభ్యత్వాన్ని కల్పించాలని పేర్కొన్నారు. కొలీజియం చేస్తోన్న సిఫారసుల్లో పారదర్శకత కొరవడిందంటూ ఇదివరకు ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ కర్ సహా పలువురు కేంద్ర మంత్రులు విమర్శలు చేసిన నేపథ్యంలో- కిరణ్ రిజిజు నేరుగా సీజేఐ డీవై చంద్రచూడ్ కు ఈ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.