కిసాన్ సంసద్: జంతర్మంతర్ వద్ద రైతుల నిరసన, తొలిరోజు ప్రశాంతం
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నాకు దిగారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతన్న నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద తమ నిరసన చేసేందుకు 200 మందికిపైగా రైతులు చేరుకున్నారు.
భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ ఆధ్వర్యంలో రైతు నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా నుంచి 200 మంది, కిసాన్ సంఘర్ష్ కమిటీ నుంచి ఆరుగురు రైతులు ధర్నాలో పాల్గొన్నారు. వీరంతా సింఘూ సరిహద్దు నుంచి ప్రత్యేక బస్సుల్లో జంతర్ మంతర్ చేరుకున్నారు. పెగాసస్ స్పైవేర్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తమ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారేమోనని రైతు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
కిసాన్ సంసద్(రైతు సభ/పార్లమెంట్) పేరుతో ఈ నిరసన చేపట్టారు. పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రతిరోజూ 200 మంది జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్ నిర్వహించనున్నారు. ఆగస్టు 9 వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆందోళనలు కొనసాగుతాయి.
షరతుల ప్రకారం 206 మందికే పోలీసులు అనుమతిచ్చారు. కాగా, గురువారం తొలి రోజు రైతుల నిరసన ప్రశాంతంగా జరిగింది. మరోవైపు, వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, రైతులతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రైతులు నిరసనలు మానుకుని చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.
కాగా, రైతులు చేపట్టిన కిసాన్ సంసధ్కు మద్దతుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటులోని గాంధీ విగ్రహం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజ్యసభలో వ్యవసాయ చట్టాలపై చర్చించాలని శిరోమణి అకాలీదళ్ సభ్యులు డిమాండ్ చేశారు. కాగా, ఈ ఏడాది జనవరిలో రైతుల నిరసనలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. కిసాన్ సభలో పాల్గొనేవారికి గుర్తింపు కార్డులను కూడా ఇస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుంాడ భారీ బందోబస్తు చేపట్టారు.