మానస సరోవరంలో తెలుగు యాత్రికుల కష్టాలు.. కిషన్ రెడ్డి చొరవ.. హెలికాప్టర్లో తరలించే ప్రయత్నం
ఢిల్లీ : కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి తనదైన స్టైల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ క్రమంలో మానస సరోవరం యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను కాపాడే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలో వారిని రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని నేపాల్ లోని భారత ఎంబసీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సూచించారు.
కిషన్ రెడ్డి ఆదేశాలతో అధికారుల్లో చలనం మొదలైంది. ఆ మేరకు ఎంబసీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా మానస సరోవరంలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను నేపాల్ రాజధాని ఖాట్మండుకు సురక్షితంగా తరలించే పనిలో నిమగ్నమయ్యారు.
Recommended Video
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అడ్డదారులు.. ఇతరుల పరీక్షలు రాస్తూ బుక్కైన భార్యాభర్తలు
ఈ నెల 13వ తేదీన హైదరాబాద్కు చెందిన 40 మంది మానస సరోవరం యాత్రకు బయలుదేరారు. అనుకోని పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్నారు. బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలు తెగిపోయాయి. దాంతో గత ఐదు రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నారు. సదరన్ ట్రావెల్స్ ద్వారా మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు చైనా నేపాల్ బోర్డర్లో చిక్కుకుపోయారు.
అదలావుంటే తాము సదరన్ ట్రావెల్స్ నిర్వాహకులను అడిగితే ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. మానస సరోవరం యాత్రలో భాగంగా తాము చైనా నేపాల్ బోర్డర్లో చిక్కుకున్నామని.. వెంటనే రక్షించే ఏర్పాట్లు చేయాల్సిందిగా వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో ఏమి చేయాలో పాలుపోక చివరకు ఓ వీడియో సందేశం రికార్డు చేసి కుటుంబ సభ్యులకు పంపించడంతో విషయం కాస్తా బయటి ప్రపంచానికి తెలిసింది. అది కాస్తా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. ఆ మేరకు వారిని రక్షించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీచేశారు.