అధిష్టానంపై అసంతృప్తి: రాహుల్ కోటరీపై కిశోర్ చంద్రదేవ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వేచ్ఛగా పని చేసేందుకు అవకాశం ఇవ్వకుండా విజయాలు సాధించటం లేదని విమర్శించటం ఎంత మాత్రం తగదని మాజీ కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు కిశోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు. కిశోర్ చంద్రదేవ్ శుక్రవారం తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ సమర్థంగా పని చేయటం లేదనే వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచంచారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ చుట్టూ కోటరీగా తయారైన కొందరు నాయకులు తమ తప్పులను మరుగుపరచుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వ పటిమను చర్చనీయాంశంగా మారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాహుల్ గాంధీని గట్టిగా సమర్థిస్తూ అయన పార్టీని తన పద్ధతిలో నడిపించాలనుకుంటున్నారని, పార్టీని ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే కొందరు సీనియర్ నాయకులు అన్నింటికి అడ్డుతగులుతున్నారని కిశోర్ చంద్రదేవ్ విమర్శించారు.
పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే కొందరు సీనియర్ నాయకులు పార్టీలో మార్పులు చేసేందుకు సమ్మతించటం లేదని ఆయన విమర్శించారు.
పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు అధినాయకత్వం చుట్టూ తిరుగుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారని, పార్టీ అధికారంలో ఉంటే మంత్రి పదవులు, ఇతర ముఖ్యమైన పదవులు సంపాదించుకుంటారని, అధికారం కోల్పోయినప్పుడు వీరు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉంటూ తమ అధికారాన్ని కొనసాగించుకుంటున్నారని కిశోర్ చంద్రదేవ్ విమర్శించారు.
పార్టీలో ఉన్నత పదవులు నిర్వహిస్తున్న కొందరు నాయకులకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా దొడ్డిదారిని పార్లమెంటుకు రావటం అలవాటుగా మారిపోయిందని ఆయన దుయ్యబట్టారు. ఎప్పుడూ అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండే ఇలాంటి సీనియర్ నాయకుల మూలంగానే పార్టీకి చెడ్డపేరు వస్తోందని, పార్టీకి దెబ్బ తగులుతోందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ బాగుపడాలంటే ఈ కోటరీని దూరం పెట్టవలసిన అవసరం ఎంతో ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
కోటరీకి చెందిన కొందరు నాయకులు అవలంబించిన తప్పుడు విధానాల వల్లనే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించే అధికారం ఈ సీనియర్ నాయకులకు ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.