ఎస్బీఐ బాదుడు నేటి నుంచే: ఖాతాదారులకు మోతే, దేనిపై ఎంతంటే?
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇటీవల విధించిన కొత్త చార్జీలు నేటి(జూన్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి.
అమరావతి: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇటీవల విధించిన కొత్త చార్జీలు నేటి(జూన్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. మొబైల్ యాప్ 'ఎస్బీఐ బ్యాంక్ బుడ్డీ'తో నగదు విత్ డ్రా, తదితరాలకు కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి.

ఛార్జీల మోతే..
నగదు ఉపసంహరణ, చెల్లింపులపై ప్రతి నెలా తొలి నాలుగు లావాదేవీలు మాత్రమే ఖాతాదారులకు ఉచితం. ఆపై జరిపే ప్రతి లావాదేవీపై రూ.50 సేవా పన్నును ఎస్బీఐ వసూలు చేయనుంది. ఇక ఎస్బీఐ ఏటీఎంల్లో కార్డు ద్వారా నగదు విత్డ్రా చేస్తే రూ.10, ఇతర బ్యాంకు ఎటీఎం నుంచి విత్డ్రా చేస్తే రూ.20 వడ్డించనుంది.
ఇక సాధారణ సేవింగ్స్ ఖాతాలపై మెట్రో నగరాల్లో ఎనిమిది ఉచిత ఏటీఎం లావాదేవీలు (ఎస్బీఐ ఏటీఎంలలో 5, ఇతర ఏటీఎంలలో 3) కొనసాగుతాయి.

ఆన్లైన్ లావాదేవీలపైనా..
ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై కూడా అదనపు చార్జీలను వసూలు చేయనుంది. ఐఎంపీఎస్, యూపీఐ, ఐయూఎస్ఎస్డీల ద్వారా రూ.లక్ష వరకు లావాదేవీలపై సేవా పన్ను కాక అదనంగా రూ.5 చెల్లించాల్సిందే. రూ. లక్ష నుంచి 2 లక్షల మధ్య లావాదేవీలపై రూ.15, రూ.2 లక్షల నుంచి 5లక్షల లావాదేవీలపై రూ.25 అదనంగా వడ్డించనుంది.

చిరిగిన నోట్లు తెచ్చినా..
ఇదిలా ఉండగా, చిరిగిన నోట్ల మార్పిడిపై కూడా బ్యాంకులు అదనపు చార్జీలు వసూలు చేయనున్నాయి. పాడైపోయిన నోట్లను మార్చుకోవాలని వెళితే, ఆ మొత్తం రూ. 5 వేల కన్నా ఎక్కువ లేదా 20 నోట్లు ఉంటే, ఒక్కో నోటుకు రూ. 2 ప్లస్ సర్వీస్ చార్జ్ ని బ్యాంకు వసూలు చేస్తుంది.

హడలిపోతున్న ఖాతాదారులు
అలాగే నెలకు రూ.50 వేలకు మించి చెల్లింపులు జరిపే వారి నుంచి 5 శాతం టీడీఎస్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కొత్త చెక్ బుక్ కావాలంటే రూ. 30 (10 చెక్కులు), రూ. 75 (25 చెక్కులు), రూ. 150 (50 చెక్కులు)కి తోడు అదనంగా సర్వీస్ టాక్స్ చెల్లించాల్సిందే. ఇక సాధారణ సేవింగ్స్ డిపాజిట్ ఖాతా కలిగివున్న వారు ఉచిత లావాదేవీల తరువాత, ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంను వాడి డబ్బు తీసుకుంటే రూ. 50 చెల్లించాల్సిందే. ఎస్బీఐ తీరుతో ఆ బ్యాంక్ ఖాతాదారులు హడలిపోతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకే ఇలా బాదుతుండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications