జయ కొడనాడు ఎస్టేట్ 900 ఎకరాలు: అమ్మ, శశి గదుల్లో సూట్ కేస్ లు మాయం !
జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డును హత్య చేసిన నిందితులు జయ, శశికళ గదుల తాళాలు పగలగొట్టి సూట్ కేసులు, విలువైన పత్రాలు చోరీ చేశారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు కబ్జా చేసేందుకే అమెకు అత్యంత ఇష్టమైన కొడనాడు ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ ను హత్య చేశారని ప్రత్యేక దర్యాప్తు పోలీసు బృందం అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
విదేశీయుల ఎస్టేట్ రూ. 7 కోట్లకు తీసుకున్న జయలలిత: హత్య, శశికళ చేతిలో !
ఇప్పటికే కొడనాడు ఎస్టేట్ హత్య కేసు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు పోలీసు బృందం అధికారులు వివిద కోణాల్లో విచారణ ప్రారంభించారు. కొడనాడుతో పాటు తమిళనాడులో ఆరు ప్రాంతాల్లో విచారణ మొదలుపెట్టారు. కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొడనాడు ఎస్టేట్ వాచ్ మెన్ కృష్ణ బహుదూర్ ను విచారించి వివరాలు సేకరిస్తున్నారు.
కొడనాడు ఎస్టేట్
ఇంగ్లాండ్ కు చెందిన కుటుంబ సభ్యుల నుంచి జయలలిత కొడనాడు ఎస్టేట్ ను రూ. 7 కోట్లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ మార్కెట్ విలువ రూ. 200 కోట్లు. అయితే కొడనాడు టీ ఎస్టేట్ ధర దీని రెండింతలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అమ్మ ఇక్కడికి వెళ్లి
జయలలిత విశ్రాంతి తీసుకోవడానికి కొడనాడు ఎస్టేట్ కు వెలుతుంటారు. జయలతి చికిత్స కోసం ఎక్కువగా ఇదే కొడనాడు ఎస్టేట్ లో బసచేసేవారు. గతంలో అక్కడే ఆమెకు నమ్మకస్తులైన వైద్యులు వైద్య చికిత్సలు చేశారు.
కొడనాడు టీ ఎస్టేట్ 900 ఎకరాలు
జయలలితకు చెందిన కొడనాడు టీ ఎస్టేట్ 900 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఎస్టేట్ కు 12 గేట్లు ఉన్నాయి. టీ ఎస్టేట్ లో అనేక మంది పని చేస్తున్నారు. చూడటానికి కొడనాడు టీ ఎస్టేట్ చాల అందంగా ఉంటుంది.
జయలలిత మరణంతో
కొడనాడు ఎస్టేట్ మీద అనేక మంది కన్నుపడింది. జయలలిత మరణించిన తరువాత కొడనాడు ఎస్టేట్ ను స్వాధీనం చేసుకోవడానికి చాల మంది పోటీపడ్డారని సమాచారం. కొడనాడు ఎస్టేట్ ఆస్తి పత్రాలు మాయం చెయ్యడానికి అక్కడి సెక్యూరిటీ గార్డు ఓం బహుదూర్ ను హత్య చేశారని తెలిసింది.
జయలలిత, శశికళ గదుల్లో
కొడనాడు ఎస్టేట్ లోని బంగ్లాలో జయలలిత, శశికళకు ప్రతేక గదులు ఉన్నాయి. సోమవారం వేకువ జామున సెక్యూరిటీ గార్డును హత్య చేసిన నిందితులు జయలలిత, శశికళ గదుల తాళాలు పగలగొట్టి రెండు సూట్ కేస్ లతో పాటు విలువైన పత్రాలు చోరీ చేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.
శశికళ కుటుంబ సభ్యులు
కొడనాడు టీ ఎస్టేట్ ఆలనాపాలనా శశికళ కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని తెలిసింది. అక్కడే కొన్ని సంవత్సరాలు నుంచి మకాం వేసిన చిన్నమ్మ కుటుంబ సభ్యులు టీ ఎస్టేట్ బాధ్యతలను వారి చేతుల్లోకి తీసుకున్నారని సమాచారం.
ఆ రెండు జీపులు ఎవరివి ?
రెండు బోలెరో జీపులు కొనడాడు ఎస్టేట్ లోకి వెళ్లి వచ్చాయని స్థానిక గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే జయలలిత కొడనాడు ఎస్టేట్ బంగ్లా దగ్గర ఏర్పాటు చేసిన సీసీకెమెరాలను పరిశీలించిన పోలీసు అధికారులు ఆధారాలు సేకరించారు. ఆరెండు జీపులు ఎవరివి ? ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఎక్కడ చేశారు ? అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.