మహిళ నిర్బంధం: మూడు వారాలు గ్యాంగ్ రేప్, చిత్రీకరణ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఓ వివాహితను దుండగులు మూడు వారాల పాటు నిర్బంధించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 20 ఏళ్ల వయస్సు గల ఆమె వారి నుంచి పారిపోయి రావడంతో సంఘటన వెలుగు చూసింది. ఆ తర్వాత నిందితులపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తనకు తెలిసిన ముగ్గురు వ్యక్తులు తనను నిర్బంధించి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ సంఘటనలను చిత్రీకరించి వ్యభిచారంలోకి దించడానికి ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు సమీపంలోని బగుయాతి నుంచి తుపాకితో బెదిరించి ఆమెను నవంబర్ 8వ తేదీన అపహరించారు. డిసెంబర్ 1వ తేదీన ఆమె వారి నుంచి తప్పించుకుంది.
ఈ నెల 12వ తేదీన ముగ్గురు వ్యక్తులపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది. పర్వేజ్, అఫ్సర్, ప్రశాంత అనే ముగ్గురు వ్యక్తులు తనపై దారుణానికి ఒడిగట్టినట్లు ఆమె తెలిపింది. ఆ ముగ్గురు కూడా స్థానికంగా ఉన్న బార్లో పనిచేస్తుండేవారు. వారు పరారీలో ఉన్నట్లు సమాచారం.
తనపై తెరిపి లేకుండా వారు అత్యాచారం చేశారని, వీడియో తీశారని, ఫొటోలు కూడా తీశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను వ్యభిచారంలోకి దించడానికి ప్రయత్నించారని, తాను నిరాకరించడంతో కొట్టారని ఆమె ఆరోపించింది. బాగయుతిలో షాపింగ్ చేస్తుండగా ఆమెను అపహరించినట్లు సమాచారం. ఆ తర్వాత తెఘోరియా సమీపంలోని అపార్టుమెంటుకు తీసుకుని వెళ్లి ఆమె చేత బలవంతంగా మత్తుపదార్థాలు కలిపిన పండ్ల రసం తాగించారని చెబుతున్నారు.