రాహుల్తోనే తేల్చుకుంటా, ‘మునుగోడు’కు పిలుపులేదు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి పీసీసీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉప ఎన్నిక కార్యక్రమాలపై పీసీసీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. పిలవని పేరంటానికి తాను వెళ్లనని స్పష్టం చేశారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆయన టీంకి, కోమటిరెడ్డి బ్రదర్స్కి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.
నన్ను అవమానించినవారిని సస్పెండ్ చేయాలి: కోమటిరెడ్డి
శుక్రవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక గురించి తనతో ఎవరూ మాట్లాడలేదని, దాని గురించి నాకేం తెలియదన్నారు. చండూరు సభలో ఓ పిల్లాడితో తనను తిట్టించారని, తమను అవమానించినవారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీనియర్ నేతను తిట్టిన అతడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. రేపటి పాదయాత్రకు తనను పిలవలేదని, తనను అవమానించిన తర్వాత తాను ఎలా వెళతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.
దాసోజు శ్రవణ్ చెప్పింది నిజమేనంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
చండూరు సభలో ఓ కార్యకర్తతో నన్ను తిట్టించారు. అక్కడే అతన్ని లాగిపెట్టి కొట్టాల్సింది. నాలాంటి సీనియర్ను తిట్టిన అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. తిట్టించిన వాళ్లు క్షమాపణ చెప్పాలి. అప్పుడు మాత్రమే అక్కడ ప్రచారంపై ఆలోచన చేస్తా. దాసోజు శ్రవణ్ చెప్పినట్టు.. పార్టీలో ప్రాంఛైజీ నడుస్తోంది. ఈ విషయమై ఢిల్లీలో రాహుల్ గాంధీ దగ్గరనే తేల్చుకుంటా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
Recommended Video
హాట్ టాపిక్గా కోమటిరెడ్డి బ్రదర్స్
కాగా, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి.. రాష్ట్ర నాయకత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. కోమటిరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్న విషయం తెలిసిందే. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డితోపాటు వెంకటరెడ్డిపైనా పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి వెనుకుండి ఈ విమర్శలు చేయిస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వెంకటరెడ్డి అంటున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతోనే తాను రాష్ట్ర నాయకత్వంపై తేల్చుకుంటానని వెంకటరెడ్డి చెబుతున్నారు. తన సోదరుడు సరైన నిర్ణయం తీసుకుంటారనని తాను భావిస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా హాట్ టాపిక్గా మారారు.