కూ.. కూస్తోంది: ట్విట్టర్ పరిణామాలతో దేశీయ సోషల్ మీడియా వైపు చూపు: ప్రత్యామ్నాయంగా
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం, టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్.. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం ముగిసింది. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి వెళ్లింది. ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. దీనికోసం ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ విలువ 44 బిలియన్ డాలర్లు. ఇప్పుడున్న ట్విట్టర్ యాజమాన్యానికి ఎలాన్ మస్క్ చెల్లించిన మొత్తం ఇది. మూడు నెలల వ్యవధిలో ఈ బదలాయింపు ప్రక్రియ పూర్తవుతుంది.
మస్క్పై మస్త్గా ట్రోల్స్..
ఈ పరిణామాలపై ట్విట్టర్ యూజర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొందరు స్వాగతిస్తోండగా.. చాలామంది వ్యతిరేకిస్తోన్నారు. ఎలాన్ మస్క్ను లక్ష్యంగా చేసుకుని.. ట్రోల్స్ మొదలు పెట్టారు. అది కూడా ట్విట్టర్పైనే. ఎలాన్ మస్క్పై మెమెస్ పోస్ట్ చేస్తోన్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే వేలాది ట్వీట్లు పడ్డాయి. #twittersold అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. ఈ హ్యాష్ ట్యాగ్తో ట్విట్టర్ షేక్ అవుతోంది. విభిన్న రకాల ట్వీట్లతో పోటెత్తుతోంది.
లీవింగ్ ట్విట్టర్..
దీనితోపాటు #leavingtwitter అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్ చేతులు మారడాన్ని మెజారిటీ యూజర్లు స్వాగతించట్లేదు. ఎలాన్ మస్క్ ఇందులో ఎంటర్ అయిన తరువాత ఈ ప్లాట్ఫామ్ పూర్తిగా మారిపోతుందని, భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు పడే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తోన్నారు. తమ అంచనాలు, అభిప్రాయాలను #leavingtwitterతో పోస్ట్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను వెదుక్కుంటున్నామంటూ చెబుతున్నారు.
ప్రత్యామ్నాయంగా.. కూ
ఇది కాస్తా దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ కూ (Koo)కు వరంలా మారినట్టే కనిపిస్తోంది. ట్విట్టర్కు ప్రత్యామ్నాయంగా కూ సోషల్ నెట్వర్క్లో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారిగా కూ నెట్వర్క్కు భారీ డిమాండ్ ఏర్పడిందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేసే దేశీయ సోషల్ మీడియా నెట్వర్క్ ఇది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, అస్సామీ భాషల్లో అందుబాటులో ఉంది. 2020లో అప్రమేయ రాధాకృష్ణ దీన్ని నెలకొల్పారు. మయాంక్ బిడవట్క సహ వ్యవస్థాపకుడు.
ట్రాన్స్పరెన్సీ..
కూ నెట్వర్క్ను మరింత ట్రాన్స్పరెన్సీగా మార్చింది మేనేజ్మెంట్. దీనికి సంబంధించిన కోర్ అల్గోరిథమ్స్ను పబ్లిష్ చేసింది. తటస్థత, జవాబుదారితనాన్ని పెంపొందించడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఫౌండర్ అండ్ సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ, కో ఫౌండర్ మయాంక్ బిడవట్క చెప్పారు. ఫీడ్, ట్రెండింగ్, పీపుల్ రెకమండేషన్స్, నోటిఫికేషన్స్ విభాగాల అల్గోరిథమ్స్ను బహిర్గతం చేశామని పేర్కొన్నారు.
ట్విట్టర్పై డౌట్స్..
ట్విట్టర్ను భావ ప్రకటన స్వేచ్ఛ ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దుతానంటూ ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇకపై లిబరల్స్ కన్నీరు పెట్టుకోవాల్సి ఉంటుందంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు కళ్లెం పడుతుందని జోస్యం చెబుతున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఆ స్వేచ్ఛ లేకుండా చేస్తారంటూ అనుమానాలను వెలిబుచ్చుతున్నారు. ట్విట్టర్ పిట్ట గొంతు నులిమే ప్రయత్నం చేస్తారంటూ ట్రోల్స్ చేస్తున్నారు.