నన్ను వేధించారు.. జైల్లో వేశారు: కన్నీరు పెట్టిన డీకే శివకుమార్
బెంగళూరు: అత్యంత ఉత్కంఠత రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్కు అనుకూలంగా వెలువడుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని కాంగ్రెస్ అందుకుంది. తాజా సమాచారం ప్రకారం- 132 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇందులో పలు నియోజకవర్గాల్లో విజయం సాధించారు.
నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీజేపీ 64 నియోజకవర్గాలకే పరిమితమైంది. ఈ సంఖ్య మరింత తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్) బాగా నష్టపోయింది. తన కంచుకోటలను ప్రత్యర్థి పార్టీలకు కోల్పోయింది. రామనగరలో కుమారస్వామి కొడుకు, ప్రముఖ నటుడు నిఖిల్ కుమారస్వామి సైతం ఓడిపోయారు. 21 నియోజకవర్గాల్లో జేడీఎస్ ఆధిక్యతలో ఉంది.

224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 113 స్థానాలు అవసరం. ఈ మార్క్ను అందుకుంది కాంగ్రెస్. ఈ విజయం పట్ల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్ స్పందించారు. భావోద్వేగానికి గురయ్యారాయన. కనకపుర నియోజకవర్గం నుంచి ఆయన ఘన విజయాన్ని సాధించారు. భారీ మెజారిటీతో బీజేపీకి చెందిన మంత్రి ఆర్ అశోకను ఓడించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. కన్నడ ప్రజలు తమకు తిరుగులేని విజయాన్ని అందించారని, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటోన్నానని అన్నారు. తమ పార్టీ పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపారని, అత్యంత అవినీతిమయమైన బీజేపీ ప్రభుత్వానికి కన్నడిగులు చరమగీతం పాడారని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.
I can't forget Sonia Gandhi came to meet me jail : DK Sivakumar gets emotions and thanked Congress leadership for trusting him.#KarnatakaElectionResults2023#BJPMuktSouthIndiapic.twitter.com/JZE4WO0q30
— Classic Mojito (@classic_mojito) May 13, 2023
అధిష్ఠానం నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేశారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తనను అమానవీయంగా వేధించిందని, జైల్లో వేసిందని డీకేశి అన్నారు. ఆ సమయంలో సోనియాగాంధీ తనను పరామర్శించడానికి జైలుకు సైతం వచ్చారని గుర్తు చేసుకున్నారు.
అకారణంగా, తనపై అక్రమ కేసులను బనాయించి జైలుపాలు చేసిన బీజేపీకి తగిన శాస్తి జరిగిందని, ఈ ఎన్నికల్లో ప్రజలు బాగా బుద్ధి చెప్పారని డీకే శివకుమార్ అన్నారు. బీజేపీ నాయకులు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారని చెప్పారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటోన్నానని అన్నారు.












Click it and Unblock the Notifications