బెంగళూరులో కాంగ్రెస్ గూండాగిరి, ప్రభుత్వ కార్యాలయంలో చల్లింది పెట్రోల్ కాదు, అదే!
బెంగళూరు: బెంగళూరులోని హోరమావు బీబీఎంపీ ప్రభుత్వ కార్యాలయంలో పెట్రోల్ చల్లి నిప్పంటించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ నమోదు అయిన కేసులో కేఆర్ పురం కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణస్వామి శుక్రవారం పోలీసుల ముందు లొంగిపోయాడు. తాను కార్యాలయంలో చల్లింది పెట్రోల్ కాదని ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చాడు.
పెట్రోల్ తీసుకెళ్లి!
ఫిబ్రవరి 16వ తేదీ నారాయణస్వామి బాటిల్ లో పెట్రోల్ తీసుకుని బీబీఎంపీ కార్యాలయంలోకి వెళ్లాడు. తరువాత వీఆర్ఓ చెంగలరాయప్ప, అధికారులు, సిబ్బందిని బెదిరించాడు. అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయంలోని ఫర్నీచర్, రికార్డులు భద్రపరచిన బీరువాల మీద పెట్రోల్ చల్లి నిప్పంటించడానికి ప్రయత్నించాడు.
అరెస్టు చెయ్యండి, సీఎం
నారాయణస్వామిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బెంగళూరు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు బీబీఎంపీ ఉద్యోగుల నుంచి ఫిర్యాదు స్వీకరించి విచారణ చేశారు.
ఆరు కేసులతో ఉక్కిరిభిక్కిరి
నారాయణస్వామిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడంతో రామమూర్తి నగర పోలీసులు రంగంలోకి దిగారు. వైరల్ వీడియో సాక్షం ఆధారంగా ఐపీసీ 353, 427, 341, 504, 506 తదితర సెక్షల కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన నారాయణస్వామి కోసం గాలించారు.
అది పెట్రోల్ కాదు
శుక్రవారం కేజీ హళ్ళి పోలీస్ స్టేషన్ లోని బాణసవాడి ఉప విభాగం ఏసీపీ మహదేవ బృందం ముందు నారాయణస్వామి లొంగిపోయాడు. తాను బీబీఎంపీ కార్యాలయంలో చల్లింది పెట్రోల్ కాదని, జ్యూస్ అని నారాయణస్వామి మాటమార్చాడు.
ఆవేశంలో చేశాను
రెవెన్యూ శాఖ అధికారి చెంగలరాయప్ప తనకు ఖాతా చెయ్యలేదని ఆవేశంలో అలా జ్యూస్ చల్లి తప్పు చేశానని, అవకాశం ఇస్తే తప్పు సరిదిద్దుకుంటానని నారాయణస్వామి పోలీసులకు మనవి చేశారు. అరెస్టు చేస్తారనే భయంతో మైసూరు, కుక్కే, చిక్కమగళూరు, కులబర్గిలో సంచరించి ఈ రోజు వచ్చి లొంగిపోయానని నారాయణస్వామి చెప్పారు.
చల్లింది పెట్రోల్
బీబీఎంపీ కార్యాలయంలో నారాయణస్వామి చల్లింది పెట్రోల్ అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. నారాయణస్వామిని న్యాయస్థానంలో హాజరుపరిచి న్యాయమూర్తి అనుమతితో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.