ప్రభాస్ ఆదిపురుష్లో సీతగా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్కు సోకిన కరోనా: క్వారంటైన్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్.. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ధృవీకరించారు. తనకు కరోనా సోకిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని తన నివాసంలో క్వారంటైన్లో ఉంటున్నారు. తనను కలిసిన వారు ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని కృతి సనన్ విజ్ఙప్తి చేశారు. తన ఆరోగ్యం బాగుందని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.
ప్రస్తుతం తాను ఫోన్ కాల్స్, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని పేర్కొన్నారు. తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోన్న వారికి ఆమె కృతజ్ఙతలు తెలిపారు. అందరి ఆశీర్వాద బలంతో తాను త్వరగా కోలుకుంటానని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని అన్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, తమ కుటుంబ డాక్టర్ సలహా మేరకు తాను హోమ్ క్వారంటైన్లో గడుపుతున్నానని పేర్కొన్నారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని తెలిపారు.
కొద్దిరోజుల కిందటే బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్ కూడా కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కృతిసనన్ ప్రస్తుతం లుక్కా చుప్పి సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చండీగఢ్లో కొనసాగుతోంది. రాజ్కుమార్ రావ్ ఇందులో హీరో. వారం రోజుల కిందట తన షెడ్యూల్ను పూర్తి చేసుకుని కృతి సనన్ ముంబైకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమె కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోగా.. పాజిటివ్గా తేలింది.
యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటించబోతోన్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్లో.. కృతిసనన్ సీత పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్లబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో ఆమె తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సుపరిచితురాలు. రెండో మూవీలో నాగచైతన్యతో కలిసి నటించారు. దోచెయ్ సినిమాలో హీరోయిన్గా కనిపించారు. ఆ మూవీ తరువాత.. తన ఫోకస్ను బాలీవుడ్పై పెట్టారు.