జేడీఎస్ ఎమ్మెల్యే..కర్ణాటకలో మాయం: ముంబై ఆసుపత్రి ఐసీయూలో ప్రత్యక్షం
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచీ కనిపించకుండా పోయిన జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యకరంగా ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రత్యక్షం అయ్యారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న దృశ్యాలు శుక్రవారం కలకలం రేపాయి.
ఆ ఎమ్మెల్యే పేరు నారాయణ గౌడ. మండ్య జిల్లా కృష్ణరాజ పేట శాసనసభ్యుడు. కర్ణాటకలో కాంగ్రెస్ తో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న జేడీఎస్ తరఫున 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించారు. ప్రస్తుతం కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి.
ఇందులో భాగంగా- నారాయణ గౌడ కూడా అదృశ్యం కావడం జేడీఎస్ నేతల్లో అనేక అనుమానాలకు తావిచ్చింది. ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి అందుబాటులో ఉన్న అవకాశాలనూ వినియోగించుకుంటున్న బీజేపీ కర్ణాటక శాఖ నాయకులు నారాయణ గౌడను కూడా తమ వైపు ఆకర్షితుడిని చేసుకుని ఉంటారని మొదట అందరూ భావించారు.
ఆపరేషన్ కమలలో భాగంగా- నారాయణ గౌడను తమ వైపు తిప్పుకొని ఉండొచ్చని అనుమానించారు. బడ్జెట్ సమావేశాలు ఆరంభం కావడానికి ముందే- నారాయణగౌడ మాయం కావడం కూడా ఈ అనుమానాలను బలపరిచింది. ఆయన సెల్ ఫోన్ కు కూడా అందుబాటులో లేకపోవడం, పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ. ఫోన్ స్విచాఫ్ వచ్చింది.
స్వయానా ముఖ్యమంత్రి, జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ఫోన్ చేశారు. అయినప్పటికీ- బదులు రాలేదు. దీనితో- ఆయన కూడా చేజారిపోయినట్టేనని భావించారు. హఠాత్తుగా ఆయన ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇన్టెన్సివ్ కేర్ యూనిట్ లో బెడ్ పై పడుకుని, చికిత్స పొందుతున్న దృశ్యాలు, ఫొటోలు వెలుగులోకి రావడం ఆశ్చర్యానికి దారి తీసింది.
మండ్య జిల్లా వాట్సప్ గ్రూప్ లో ఈ ఫొటోలు పోస్ట్ అయ్యాయి. ఫుడ్ పాయిజన్ వల్ల అనారోగ్యానికి గురైన నారాయణ గౌడ.. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అంటున్నారు. ఈ కారణం వల్లే తాను బడ్జెట్ సమావేశాలకు హాజరు కావట్లేదని కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతున్నారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని నారాయణ గౌడ వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతున్న బీజేపీ కర్ణాటక నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప.. కొద్దిరోజులుగా క్యాంపు రాజకీయాలను నడుపుతున్నారు.
తమ ఎమ్మెల్యేలను గుర్ గావ్ కు తరలించారు. కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోవడానికి ఆపరేషన్ కమలను చేపట్టారు. కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలను ముంబైకి తరలించింది. ఆపరేషన్ కమల మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టే తిరిగింది.
జేడీఎస్ ఎమ్మెల్యేలపై పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదు. అకస్మికంగా నారాయణ గౌడ మాయం కావడం పార్టీలో ఆందోళనకు దారి తీసింది. ఆయన ముంబై ఆసుపత్రిలో కనిపించడంతో జేడీఎస్ పెద్దలకు తాత్కాలికంగా ఉపశమనం కలిగినట్టే.
ఫుడ్ పాయిజన్ పై చికిత్స తీసుకోవడానికి నారాయణ గౌడ ఏకంగా ముంబై దాకా వెళ్లడం కూడా సందేహాలను రేకెత్తిస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఫుడ్ పాయిజనింగ్ అయితే- ఎక్కవ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండదని, రెండు లేదా మూడు రోజుల్లో తేరుకోగలరని అంటున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని ఇరుకున పెట్టాలనే ఉద్దేశపూరకంగానే నారాయణ గౌడ ఆసుపత్రిలో చేరి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు.