కొత్త నిబంధనకు శ్రీకారం: ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలట
కర్నాటక ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది కుమారస్వామి ప్రభుత్వం. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతమైన విద్య అందించడంతోపాటు, సదుపాయాలు కూడా మెరుగుపడుతాయని ఆ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మహేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల సంఖ్య పెరగాలన్న మంచి ఉద్దేశంతో ఒక విధానం తీసుకురావాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం చట్టపరమైన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లలో చేర్పించడం ద్వారా ఈ స్కూళ్ల అభివృద్ధిలో ఉద్యోగస్తులను భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నట్లు మంత్రి మహేష్ తెలిపారు. అయితే న్యాయపరంగా లేదా చట్టపరంగా ఈ ఆలోచన నిలుస్తుందో లేదో చెప్పలేమని మహేష్ అన్నారు. దీనిపై న్యాయనిపుణుల సలహా కోరినట్లు వివరించిన మంత్రి మహేష్... సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వెళ్లలేమని స్పష్టం చేశారు. పిల్లలు ఎక్కడ చదవాలో రాష్ట్రప్రభుత్వాలకు నిర్ణయించే అధికారం లేదంటూ గతంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
సెప్టెంబర్ 2017లో కన్నడ డెవలప్మెంట్ అథారిటీ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు, మార్పలు తీసుకొచ్చేందుకు నిబంధనలు తీసుకొచ్చింది. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందుతున్న ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపాలని... ఒకవేళ నిబంధన తప్పినట్లయితే చర్యలు తీసుకుంటామని ఒక నివేదిక ఇచ్చింది. నాణ్యమైన విద్య అందించడం, మరిన్ని సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలకు కల్పించడం కోసమే ఈ తరహా నిబంధన తీసుకొచ్చినట్లు కర్నాటక డెవలప్మెంట్ అథారిటీ తెలిపింది.
ప్రభుత్వ ఏజెన్సీలు, పలు స్వతంత్ర పరిశోధనలు కర్నాటకలోని ప్రభుత్వ పాఠశాలలపై, వాటి పనితీరును తప్పుబట్టాయి. కర్నాటకలోని 5,525 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తమ పాఠశాల భవంతులను పునర్నిర్మించాలని ప్రభుత్వం దగ్గర మొరపెట్టుకున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ 2017-18లో చేపట్టిన సర్వే తెలిపింది.