ఈయనతో మాట్లాడడం వేస్ట్: జైరాంపై లగడపాటి ఫైర్
న్యూఢిల్లీ: జీవోఎం సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాం రమేష్పై సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు నిప్పులు చెరిగారు. మీరూ.. చిదంబరం కలిసి రాష్ట్రాన్ని చీల్చేందుకు కుట్ర చేశారని వారు విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై తమ వ్యూహం గురించి సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో తమలోతాము చర్చించుకుంటుండగా వారితో మాట్లాడేందుకు జైరాంరమేష్ అక్కడికి వచ్చారు.
సీమాంధ్ర మంత్రులు సహకరించి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేశారని, వాటిని పట్టించుకోలేదని, మంత్రివర్గంలో చర్చ జరిగేటప్పుడు సమయం కావాలని కోరితే కనీసం అది కూడా ఇవ్వడం లేదని వారన్నారు. తమ మంత్రుల విజ్ఞప్తిని చిదంబరం తిరస్కరిస్తే మీరు వంతపాడతారా అని సబ్బం హరి జైరాం రమేష్ను ప్రశ్నించారు. 1956 నాటి తెలంగాణ కావాలంటే మీరు భద్రాచలాన్ని కూడా వారికే ఇస్తారా? యూటీ అడిగినా బుట్టదాఖలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం డిజైన్ మారుస్తానంటూ ఎలా చెబుతారని ఉండవల్లి అరుణ్ కుమార్ జైరాం రమేష్ను నిలదీశారు. పోలవరం ఇవ్వాలని మీకు లేదని, ఉంటే డిజైన్ మారుస్తానని ఎందుకంటారని అన్నారు. తెలంగాణ ఇవ్వకముందే తమకు అన్యాయం చేస్తామని ప్రకటిస్తే ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నించారు.
అసలు జైరాం రమేష్తో మాట్లాడడం వృధా, మనం మాట్లాడుకుందామని లగడపాటి రాజగోపాల్ జైరాం ముందే అన్నారు. దీంతో జైరాం మారు మాటాడకుండా అక్కడనుంచి వెళ్లిపోయారు. కాగా తాను అధిష్ఠానం చెప్పినట్లు చేయాల్సిందేనని, సిడబ్ల్యుసి తీర్మానం, కేబినెట్ నోట్లో లేని వాటి గురించి తానెలా వాదించాలని జైరాం తర్వాత మీడియాతో అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు చేసి కేంద్రమే నిధులు కల్పించాలని తానే వాదించి బిల్లులో చేర్చానని ఆయన సమర్థించుకున్నారు.