లఖింపూర్ ఖేరీ: రైలు పట్టాలపై రైతుల ఆందోళనలు, 160 రైళ్ల రాకపోకలకు అంతరాయం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం రైతులు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్దరేశ్ రాష్ట్రాల్లో రైల్ రోకో చేపట్టారు.
రైలు పట్టాలపైకి చేరి నిరసనలు తెలియజేశారు రైతు సంఘాల నేతలు, రైతులు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్ రోకో నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో రైతులు రైల్ రోకో చేపట్టాయి. పట్టాలపై కూర్చుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తప్పించాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలపడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్ రోకో కారణంగా 160 రైళ్లకు అంతరాయం ఏర్పడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరో 43 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉత్తర రైల్వే జోన్ పరిధిలో దాదాపు 150 ప్రాంతాల్లో రైతులు రైలు పట్టాలపై ఆందోళన చేపట్టారు. దీంతో కొన్ని రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లు దారిమళ్లించారు. మరికొన్నింటినీ దారిలోనే నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు తప్పలేదు.
Recommended Video
కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్ వాహనం దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఆ తర్వాత రైతులు ఆగ్రహంతో... బీజేపీ కార్యకర్తలతోపాటు ఓ డ్రైవర్ను మొత్తం నలుగురిని కొట్టి చంపారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆశిష్ మిశ్రాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications