మండుతున్న లఖింపూర్: ప్రియాంకా గాంధీ అరెస్ట్: కారులో నుంచి సెల్ఫీ వీడియో
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణిస్తోన్న కారు కింద పడి నలుగురు రైతులు దుర్మరణం పాలు కావడం, ఆ తరువాత చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల్లో మరో నలుగురు మృతి చెందడంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. లఖింపూర్ ఖేరిలో పలుచోట్ల 144 సెక్షన్ను విధించినట్లు తెలుస్తోంది. కొత్త వారు ఎవరూ నగరంలోనికి రాకుండా ఉండేలా పోలీసులు సరిహద్దులను మూసివేశారు.
కాన్వాయ్కు అడ్డుగా..
లఖింపూర్ ఖేరి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణిస్తోన్న కారును అడ్డుకుని, తమ నిరసన తెలియజేయడానికి రైతులు ప్రయత్నించారు. మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఏడాదికాలంగా రైతులు చేస్తోన్న నిరసన దీక్షలకు కొనసాగింపుగా భారత్ కిసాన్ యూనియన్ ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేంద్రమంత్రుల కాన్వాయ్ను అడ్డుకుని, మూడు వ్యవసాయ చట్టాల పట్ల తమకు నిరసనలను తెలియజేయాలనేది వారి ఉద్దేశం.
అడ్డుకున్న రైతులు..
లఖింపూర్ ఖేరి.. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా సొంత లోక్సభ నియోజకవర్గం. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచే గెలుపొందారు. తన నియోజకవర్గంలో పర్యటించడానికి వచ్చిన ఆయనను రైతులు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. ఆయన ప్రయాణిస్తోన్న కారుకు అడ్డుగా కూర్చున్నారు. అయినప్పటికీ- లెక్క చేయలేదని, కారును రైతుల మీదుగా పోనిచ్చారనే ఆరోపణలు అజయ్ మిశ్రాపై ఉన్నాయి. ధర్నా చేస్తోన్న రైతులపై కారును పోనివ్వడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరి కొందరు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఉద్రిక్త పరిస్థితులు..
ఈ ఘటన తరువాత లఖింపూర్ ఖేరి ఒక్కసారిగా భగ్గుమంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు దాడులకు దిగారు. వాహనాలను ధ్వంసం చేశారు. కారుకు నిప్పు పెట్టారు. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను మోహరింపజేసింది. ప్రత్యేక టీమ్లను రప్పించింది. ఈ ఘటనను అత్యంత దురదృష్టకరమైనదిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
తొలుత ప్రియాంక గాంధీ హౌస్ అరెస్ట్..
మృతుల కుటుంబాలను పరామర్శించడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్ఛార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా లఖింపూర్ ఖేరికి బయలుదేరగా.. అమెను పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధంలో ఉంచారు. అయిదు గంటల పాటు ప్రియాంకా గాంధీ వాద్ర హౌస్ అరెస్ట్లో గడిపారు. అనంతరం ఆమె పోలీసుల కన్నుగప్పి తప్పించుకున్నారు. పార్టీ నాయకుల కారులో లఖింపూర్కు బయలుదేరారు.
హర్గావ్లో అరెస్ట్..
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హర్గావ్ వద్ద ఆమెను మళ్లీ అడ్డుకున్నారు. అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారు జామున 5:30 గంటలకు ప్రియాంక గాంధీ వాద్రాను అరెస్ట్ చేశారని, ఆమెను వేర్వేరు వాహనాల్లో తిప్పారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. హర్గావ్ నుంచి సీతాపూర్ జిల్లాకు తరలించారని పేర్కొన్నారు. లఖింపూర్ ఘటనలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలను పరామర్శించడానికి అనుమతి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. పోలీసులు, ప్రభుత్వం ఎంతగా అడ్డుకున్నా.. తాము లఖింపూర్ చేరుకుంటామని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
పరామర్శించడం నేరమా?
కారులో నుంచి ప్రియాంక గాంధీ వాద్రా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లఖింపూర్లో బాధిత కుటుంబాలను పరామర్శించడాన్ని యోగి సర్కార్ అడ్డుకుంటోందని ఆరోపించారు. తాము అల్లర్లను ప్రోత్సహించడానికో.. ఆందోళనకారులను రెచ్చగొట్టడానికో వెళ్లట్లేదని చెప్పారు. శాంతియుతంగా బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లే వారిని అడ్డుకోవడంలో అర్థం లేదని అన్నారు. రైతులపై కారును పోనిచ్చిన నాయకుల్లో ఇప్పటిదాకా ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం రాజకీయ దురుద్దేశమేనని ధ్వజమెత్తారు.
Recommended Video
भाजपा ने तानाशाही की सारी सीमाएं पार कर दी हैं, किसानों का दर्द बांटने जा रही श्रीमती @priyankagandhi जी को गिरफ़्तार करना यूपी की योगी सरकार की दमनकारी नीति को दिखाता है। लेकिन सत्य के पथ पर चलने वाले गांधी ऐसी हरकतों से डरते नहीं ।
— Dheeraj Gurjar (@dgurjarofficial) October 4, 2021
जय जवान
जय किसान#लखीमपुर_किसान_नरसंहार pic.twitter.com/JYrMRbSNgk