లఖీంపూర్ కేసు-మూడురోజుల కస్టడీకి ఆశిష్ మిశ్రా-సహకరించట్లేదన్న పోలీసులు
యూపీలోని లఖీంపూర్ ఖేరీలో రైతులకు కారు పోనిచ్చి 8 మంది రైతుల మరణాలకు కారకుడయ్యారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కష్టాలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే లఖీంపూర్ హింస కేసులో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు.. దర్యాప్తుకు అతను సహకరించకపోవడంతో కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో న్యాయస్ధానం పోలీసుల అభ్యర్ధనను మన్నించింది.
లఖీంపూర్ హింస కేసులో 8 మంది రైతుల మరణానికి ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రా పోలీసు దర్యాప్తుకు సహకరించడం లేదని సహరాన్ పూన్ డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ కోర్టుకు తెలిపారు. ఆయన్ను 14 రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో ఈ వ్యవహారంలో విచారణ జరిపిన న్యాయస్ధానం.. మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ కేసులో ఆశిష్ మిశ్రాను పోలీసులు టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇప్పటికే 12 గంటల పాటు ఆశిష్ ను విచారించారని, ఇంకా ప్రశ్నించాల్సింది ఏముందని పోలీసులను నిలదీశారు. ఆశిష్ పై ధర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని కోర్టులో ప్రశ్నించారు. దీంతో ధర్డ్ డిగ్రీ వంటి చర్యలు తీసుకోకుండా మూడు రోజుల పాటు విచారణ జరిపేందుకు కోర్టు ఆనుమతి మంజూరు చేసింది.

లఖీంపూర్ ఖేరీ హింస కేసులో తొలుత అరెస్టు కాకుండా తప్పించుకున్న ఆశిష్ మిశ్రా.. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత అరెస్టయ్యాడు. ఆ తర్వాత కూడా పోలీసుల దర్యాప్తుకు సహకరించడం లేదు. దీంతో ఈ కేసు విచారణ ముందుకు సాగడం లేదు. మరోవైపు సుప్రీంకోర్టు నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకుంటున్నారు. దీంతో ఆశిష్ మిశ్రాను కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టేందుకు యూపీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం, హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులపైనా తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. అయినా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండటంతో చేసేది లేక యూపీ పోలీసులు ఆశిష్ ను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేశారు












Click it and Unblock the Notifications