దేశం కోసం 60 ఏళ్ల క్రితమే ప్రధాని పిలుపు: ఒక పూట అన్నం మానేయండి!
అమెరికా-ఇరాన్ మధ్య రేగుతున్న యుద్ధ జ్వాలలు, పశ్చిమాసియాలో రోజురోజుకూ పెరుగుతున్న దాడులు, ప్రతిదాడులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలు సామాన్య భారతీయుడికి ఒక చేదు నిజంతో కూడిన ముందస్తు హెచ్చరికను పంపుతున్నాయి. అదే.. అస్థిరంగా మారనున్న అంతర్జాతీయ చమురు ధరలు, దానివల్ల దేశంలోని ప్రతి ఇంటిపై పడనున్న ఆర్థిక భారం!
ఈ నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ పౌరులకు ఒక కీలకమైన పిలుపునిచ్చారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించడం, అంతర్జాతీయంగా డాలర్ల ప్రవాహాన్ని శాసించే బంగారు కొనుగోళ్లను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడం వంటి 'స్వచ్ఛంద పొదుపు’ పాటించాలని ఆయన అభ్యర్థించారు. ఇవి ప్రభుత్వ నిర్బంధ ఉత్తర్వులు కావు, ఒక దేశంగా అంతర్గతంగా బలోపేతం కావడానికి ప్రధాని చేసిన విజ్ఞప్తి. అయితే, సంక్షోభ సమయాల్లో దేశ ప్రధాని ప్రజలను ఇలా నేరుగా భాగస్వామ్యం చేయడం భారతదేశానికి కొత్తేమీ కాదు. దాదాపు ఆరు దశాబ్దాల క్రితమే, దేశాన్ని కాపాడటానికి ఒక నిగర్వి అయిన జననేత సరిగ్గా ఇదే 'ప్లేబుక్’ను రచించారు.

ఆకలి సంక్షోభం.. ఇతరులపై ఆధారపడే భారం
అది 1965. లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరుణం. చైనాతో జరిగిన యుద్ధం సృష్టించిన గాయాల నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. అటు సరిహద్దుల్లో పాకిస్తాన్ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. కానీ, వీటన్నింటికంటే దేశాన్ని వేధిస్తున్న తక్షణ శత్రువు 'ఆకలి’. దేశంలో ఆహార ఉత్పత్తి దారుణంగా పడిపోయింది, రుతుపవనాలు ముఖం చాటేశాయి. కేవలం 18 నెలల వ్యవధిలోనే ఆహార ధాన్యాల ధరలు ఏకంగా 22 శాతం పెరిగాయి. స్వాతంత్ర్యం వచ్చి రెండు దశాబ్దాలు కూడా కాకముందే.. కోట్లాది మంది భారతీయుల ఆకలి తీర్చడం కోసం అమెరికా నుంచి వచ్చే గోధుమల దిగుమతులపై ఆధారపడటం అప్పటి ప్రభుత్వానికి, దేశ ఆత్మగౌరవానికి పెద్ద భారంగా అనిపించింది.
చట్టాలు సరిపోని చోట.. ఒక పిలుపు తెచ్చిన మార్పు
శాస్త్రి ప్రభుత్వం 'ఎసెన్షియల్ కమోడిటీస్ (అమెండ్మెంట్) చట్టం’ ద్వారా అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకుంది. నాల్గవ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి, విత్తనాలకు, ఎరువులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. కానీ, కేవలం ప్రభుత్వ విధానాలు మాత్రమే దేశాన్ని గట్టెక్కించలేవని శాస్త్రి నమ్మారు. 1965 అక్టోబర్ 10న ఆయన ఆకాశవాణి రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఎలాంటి కొత్త పన్నులు వేయలేదు, కఠిన చట్టాలు తీసుకురాలేదు. కేవలం ఒకే ఒక్క విజ్ఞప్తి చేశారు—"దేశంలోని ప్రతి పౌరుడూ వారంలో ఒక పూట భోజనాన్ని త్యాగం చేయాలి. ఒక వ్యక్తి ఒక పూట అన్నం తినడం మానేస్తే, ఆ మిగిలిన ఆహారం మరొకరి ఆకలిని తీరుస్తుంది" అని కోరారు.
ఆదర్శంగా నిలిచిన నేత.. దేశవ్యాప్తంగా 'శాస్త్రి వ్రతం’
ప్రజలను కోరడానికి ముందే శాస్త్రి ఆచరించి చూపారు. ఆయన భార్య, పిల్లలతో సహా వారి కుటుంబం మొత్తం సోమవారం రాత్రి భోజనాన్ని మానేయడం ప్రారంభించింది. ప్రజలను కోరుతున్న త్యాగాన్ని మొదట తామే అనుభవించాలనుకున్నారు. ఈ ఒక్క వ్యక్తిగత ఆదర్శం దేశంలో అప్రణాళికాబద్ధమైన, అత్యంత శక్తివంతమైన ఒక స్వచ్ఛంద ఉద్యమానికి ఊపిరిపోసింది. చూస్తుండగానే దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు సోమవారం సాయంత్రం వేళల్లో తమ వ్యాపారాలను స్వచ్ఛందంగా మూసేశాయి. కోట్లాది కుటుంబాలు తమ నిత్యకార్యక్రమాలను మార్చుకున్నాయి. ఈ నిశ్శబ్ద, భాగస్వామ్య త్యాగ ఉద్యమానికి దేశం పెట్టుకున్న పేరు 'శాస్త్రి వ్రతం’.
'జై జవాన్.. జై కిసాన్’.. ఆత్మగౌరవ నినాదం
ఈ సంక్షోభ కాలంలోనే లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశానికి అత్యంత స్ఫూర్తిదాయకమైన, నేటికీ ప్రతిధ్వనించే 'జై జవాన్, జై కిసాన్’ అనే నినాదాన్ని ఇచ్చారు. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సైనికుడికి, దేశానికి అన్నం పెట్టే రైతుకు ఆయన ఈ నాలుగు మాటలతో జై కొట్టారు. దేశ భద్రతను వ్యవసాయ స్వయంసమృద్ధిని ఒకే తాటిపైకి తెచ్చారు. సైనికుడు సరిహద్దును రక్షిస్తే.. రైతు దేశపు ఆత్మను కాపాడతాడు, ఒకరి విజయం లేకుండా మరొకరి ఉనికి లేదని చాటిచెప్పారు. అది కేవలం రాజకీయ నినాదం కాదు.. ఆత్మగౌరవంతో, స్వయంసమృద్ధితో తన కాళ్లపై తాను నిలబడటానికి ప్రయత్నిస్తున్న ఒక నవభారత ఆకాంక్ష.
నాటి ఆకలి.. నేటి ఇంధనం: ప్రజలే ఏకైక ఆయుధం
నేడు అంతర్జాతీయ పరిస్థితులు మళ్లీ పెళుసుగా మారాయి. గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటోంది. భారతదేశపు ఇంధన అవసరాలు చాలా విస్తారమైనవి, ఇక్కడ చిన్న పొరపాటు జరిగినా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన 'స్వచ్ఛంద పొదుపు’ విజ్ఞప్తి వెనుక ఉన్న తర్కం.. ఆనాడు శాస్త్రిని నడిపించిన తర్కానికి ఏమాత్రం భిన్నమైనది కాదు. బయటి శక్తులు, అంతర్జాతీయ యుద్ధాలు ప్రభుత్వం నియంత్రణ దాటిపోయినప్పుడు, దేశాన్ని కాపాడగలిగే అత్యంత నమ్మకమైన వనరు 'ప్రజలే’.
140 కోట్ల మంది కలిసికట్టుగా చేస్తే..
ఈ రోజు ఎవరూ మిమ్మల్ని ఉపవాసం ఉండమని అడగడం లేదు. నేటి అభ్యర్థనలు చాలా సరళమైనవి.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్ పడినప్పుడు కాసేపు ఇంజిన్ ఆపేయండి, వీలైతే క్యాబ్లను షేర్ చేసుకోండి లేదా మెట్రోను ఉపయోగించండి, అనవసరమైన లగ్జరీ బంగారు కొనుగోళ్లను వాయిదా వేయండి. ఇవి విడివిడిగా చూస్తే చిన్న చిన్న సర్దుబాట్లు కావచ్చు.. కానీ 140 కోట్ల మంది కలిసికట్టుగా చేస్తే, అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక రక్షణ కవచంగా మారుతుంది. నిజాయితీతో కూడిన పిలుపు, పాలకుడి వైపు నుంచి స్పష్టమైన ఆదర్శం ఉన్నప్పుడు భారతీయులు ఎప్పుడూ దేశం కోసం ముందుంటారని శాస్త్రి ఆనాడే నిరూపించారు. నాటి 'శాస్త్రి వ్రతం’ లాగే, నేటి మోదీ 'స్వచ్ఛంద ఇంధన పొదుపు’ కూడా దేశాన్ని మరో అంతర్జాతీయ సంక్షోభం నుంచి గట్టెక్కిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.














Click it and Unblock the Notifications