మోడీజీ ఎందుకు 'మౌన మోడీ'గా ఉన్నారు: డిగ్గీ రాజా
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ వీసాకు సిఫారసు చేసి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పెద్ద చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. ఆదివారం నుంచి విపక్షాలు ఆమెపై ముప్పేట దాడి చేస్తున్నాయి. విషయం వెలుగు చూసిన వెంటనే కాంగ్రెస్ తన మాటల దాడిని శనివారమే ప్రారంభించింది.
సోమవారం ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పీఎల్ పునియా మాట్లాడుతూ వారిద్దరి మధ్య 'క్విడ్ ప్రో కో' జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. సుష్మా స్వరాజ్ తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. లలిత్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారని అలాంటి వ్యక్తికి ఏ విధంగా సాయం చేస్తారని ప్రశ్నించారు.

ఆమె అనధికారికంగా లలిత్ మోడీకి సాయం చేశారని ఆరోపణలు చేశారు. వెంటనే అతడిని భారత్కు రప్పించి అతనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారా ఏచూరీ సోమవారం స్పందించారు. లలిత్ మోడీకి సాయం చేసి కేంద్రం తప్పు చేసిందని తేల్చి చెప్పారు.
మానవతా దృక్పథంతో సాయం చేశానని చెబుతున్న సుష్మాస్వరాజ్ టెర్రరిస్టులకు కూడా ఇదే తరహాలో సాయం చేస్తారా? అని ఆయన నిలదీశారు. ఈ అంశంపై ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్వజయ్ సింగ్ అన్నారు.
లలిత్ మోడీకి సాయం చేయడం పట్ల ప్రధాని తన వైఖరిని తెలపాలని కోరారు. లలిత్ మోడీకి సాయం చేయడంపై ప్రధాని ఆలోచనలు బయటకు చెప్పాలన్నారు. మోడీజీ ఎందుకు 'మౌన మోడీ'గా ఉన్నారని దిగ్విజన్ ప్రశ్నించారు. కేవలం యోగా గురించి మాత్రమే మాట్లాడుతున్నారని, ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే చేస్తున్నారని ధ్వజమెత్తారు.
లలిత్ మోడీ అంశంపై కేంద్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుష్మాకు మోడీ ప్రభుత్వం సహకరిస్తోందని అన్నారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, సుష్మాను సమర్థించడం ఘోరమని తివారీ అన్నారు. వెంటనే సుష్మా తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు బీజేపీ నేతలు మాత్రం సుష్మాను వెనుకేసుకువస్తున్నారు. మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఆమె మానవతా ధృక్పథంతోనే లలిత్ మోడీకి వీసా ఇప్పించారని ఆయన అన్నారు. ఇందులో సుష్మా ఎలాంటి తప్పిదం చేయలేదన్నారు.
ట్విట్టర్లో వివరణ ఇచ్చిన సుష్మా:
లలిత్ మోడీ భార్యకు క్యాన్సర్ ఉందని, ఆమెకు 2014 ఆగస్టులో పోర్చుగల్లో ఆపరేషన్ చేసేందుకు ఎర్పాట్లు చేసుకున్నారు. దాని కోసం పోర్చుగల్ వెల్లడానికి అనుమతించాలని లలిత్ మోడీ 2014 వేసవిలో బ్రిటన్ అధికారులను అభ్యర్థించారు.
ఇందుకు ఇంగ్లాండ్ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారని, లలిత్ మోడీ పోర్చుగల్ వెళ్లేందుకు అనుమతి ఇస్తే... భారత్, ఇంగ్లాండ్ సంబంధాలపై దెబ్బతింటాయని అప్పటి యూపీఏ ప్రభుత్వం అడ్డుపడిందని అన్నారు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నా సాయాన్ని కోరారు. దీంతో మానవతా ధృక్పదంతో ఆమె చికిత్స కోసం సహకరించాల్సిందిగా కోరానని, తానెలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications