నితీష్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటేనా?: జైలు నుంచే చక్రం తిప్పుతోన్న లాలూ: మోడీ ఆరోపణ
పాట్నా: బిహార్ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు ఆరంభమైనట్టు కనిపిస్తున్నాయి. బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మూణ్నాళ్ల ముచ్చటలా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్ను కూలదోయడానికి కుట్ర సాగుతోందంటూ బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీని వెనుక- రాష్ట్రీయ జనతా దళ్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ హస్తం ఉందనే విమర్శలు ఉన్నాయి.
బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు..
ఎన్డీఏ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి లాలూ ప్రసాద్ యాదవ్ కుట్ర పన్నారని, జైల్లో నుంచే ఆయన చక్రం తిప్పుతున్నారంటూ సుశీల్ కుమార్ మోడీ ఆరోపించారు. మంత్రివర్గంలో చోటు దక్కని సీనియర్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడానికి లాలూ ప్రసాద్ యాదవ్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జైల్లో ఉన్నప్పటికీ.. ఆయన తరచూ ఎన్డీఏ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నితీష్ కుమార్ ప్రభుత్వం మైనారిటీలో పడితే.. దానికి ఆర్జేడీ నాయకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రాంచీ జైలులో లాలూ..
దాణా కుంభకోణంలో అరెస్టయిన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచీ కారాగారంలో ఉంటున్నారు. అనారోగ్య కారణాల వల్ల రాజేంద్ర మెడికల్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందుతున్నారు. అక్కడి నుంచే ఆయన ఎన్డీఏ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారని, పదవులను ఎరగా వేస్తున్నారని సుశీల్ కుమార్ మోడీ ఆరోపించారు. ఎన్డీఏ ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్ నంబర్ను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అదే నంబర్కు తాను ఫోన్ చేయగా.. నేరుగా లాలూ ప్రసాద్ యాదవ్ కాల్ను రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. జైలులో ఉంటూ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ను ఉపయోగించవద్దంటూ హెచ్చరించినట్లు చెప్పారు.
ధృవీకరించిన జేడీయూ నేత..
ఎన్డీఏ ఎమ్మెల్యేలకు లాలూ ప్రసాద్ యాదవ్ ఫోన్లు చేస్తున్నారనే విషయాన్ని జేడీయూ సీనియర్ నేత నీరజ్ కుమార్ ధృవీకరించారు. సుశీల్ కుమార్ మోడీ చేసిన ఆరోపణలు వాస్తవమేనని అన్నారు. జైలు పాలైనప్పటికీ.. లాలూకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం లాలూ ప్రసాద్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్కు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. నితీష్ కుమార్ ప్రభుత్వం అయిదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
మూడు సీట్లే..
అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)-115, భారతీయ జనతా పార్టీ-110, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ-11, జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా-7 స్థానాలకు పోటీ చేశాయి. ఇందులో జేడీయూ-43, బీజేపీ-74 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ రెండు పార్టీలకు కలిపి 117 స్థానాలు దక్కాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 సీట్లు అవసరం. హిందుస్తాన్ ఆవామీ మోర్చా, వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ నాలుగు చొప్పున స్థానాలను గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీల మద్దతుతో జేడీయూ-బీజేపీ సంకీర్ణ కూటమి బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలతో పాటు బీజేపీలోని అసంతృప్తులకు లాలూ ప్రసాద్ గాలం వేస్తున్నారనేది తాజా ఆరోపణ.