Tamil Nadu Budget 2025: భాషా వివాదానికి మరోసారి ఆజ్యం.. బడ్జెట్లోనూ హిందీ వ్యతిరేకతే!
Tamil Nadu Budget 2025: తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా రాజకీయ యుద్ధం తీవ్రమైంది. దీని ప్రభావం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై కూడా కనిపించింది. తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తేనరసు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కానీ ఈ సమయంలో భాషా వివాదానికి మరోసారి ఆజ్యం పోసిన సంఘటన జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యా విధానం, తమిళ భాష పరిరక్షణకు సంబంధించి ఈ బడ్జెట్ లో అనేక ముఖ్యమైన ప్రకటనలు చేయబడ్డాయి. అలాగే సర్వ శిక్షా అభియాన్ కింద తమిళనాడుకు ఇవ్వాల్సిన రూ.2150 కోట్లను కేంద్రం నిలిపివేసిందని, దీని వల్ల రాష్ట్రం నష్టపోతుందని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేసినప్పటికీ ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడు తన ద్విభాషా విధానాన్ని కొనసాగిస్తోంది. తమిళనాడు బడ్జెట్ లో ప్రకటనల తర్వాత తమిళనాడులో భాషా వివాదం మరింత తీవ్రమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలో హిందీ వ్యతిరేక రాజకీయాలు తీవ్రమవుతాయని.. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత వివాదానికి దారితీయవచ్చని భావిస్తున్నారు.
బడ్జెట్ లో రూపీ సింబల్ మార్పు
తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత ఉధృతం చేసింది. దేశం మొత్తం ఉపయోగిస్తున్న రూపాయి సింబల్ ₹ను మార్చివేసింది. దాని స్థానంలో తమిళ అక్షరాన్ని చేర్చింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025-2026 బడ్జెట్ ప్రతిపాదనల్లో రూపాయి సింబల్ను తొలగించింది. తమిళ అక్షరాన్ని జోడించింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. మొదటిసారిగా ఒక రాష్ట్రం ₹ చిహ్నాన్ని మార్చింది. దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం జాతీయ కరెన్సీ చిహ్నాన్ని తిరస్కరించింది.

తమిళ భాష పరిరక్షణ కోసం మ్యూజియం
తమిళనాడు బడ్జెట్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యా విధానం, తమిళ భాషా పరిరక్షణకు సంబంధించి అనేక ముఖ్యమైన ప్రకటనలు చేశారు. తమిళ భాష పరిరక్షణ, ప్రచారం కోసం మ్యూజియం ఏర్పాటును బడ్జెట్ లో ప్రకటించారు. ఈ మ్యూజియం మధురై ప్రపంచ తమిళ సంగమ సముదాయంలో నిర్మించబడుతుంది. తమిళ భాష ప్రాచీనత, నిరంతర పరిణామాన్ని ప్రదర్శిస్తుంది.
హిందీ vs తమిళ వివాదం ఏమిటి ?
జాతీయ విద్యా విధానం-2020లోని త్రిభాషా విధానంపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం కింది త్రిభాషా విధానాన్ని అమలు చేయాలనుకుంటోంది. త్రిభాషా సూత్రం ప్రకారం హిందీ, ఇంగ్లీష్, ఓ స్థానిక భాషను విద్యార్థులు నేర్చుకోవచ్చు. కానీ తమిళనాడు ప్రభుత్వం ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హిందీకి వ్యతిరేకంగా తన వైఖరిని స్పష్టం చేసింది. గత ఒక నెల నుంచి ఈ వివాదం తీవ్రమవుతోంది.












Click it and Unblock the Notifications