కంటెయినర్లలో కోట్ల కొద్ది నకిలీ నోట్లు!: చెన్నై హార్బర్లో కలకలం..
ఈ మేరకు రూ.2వేల నోట్లతో కూడిన కోట్లాది రూపాయలు కంటెయినర్ల ద్వారా చెన్నై హార్బర్ కు చేరిందన్న వార్త అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది.
చెన్నై: భారత ఆర్థిక స్థితిని విచ్చిన్నం చేయడానికి దొంగనోట్ల మార్కెట్ ను ముంచెత్తనున్నాయన్న సమాచారం దేశాన్ని కలవరపెడుతోంది. ఈ మేరకు రూ.2వేల నోట్లతో కూడిన కోట్లాది రూపాయలు కంటెయినర్ల ద్వారా చెన్నై హార్బర్ కు చేరిందన్న వార్త అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది.
పాకిస్తాన్-బంగ్లాదేశ్ ల నుంచి భారత్ లోకి దొంగనోట్లు పంపించే ప్రయత్నం జరుగుతుందన్న ఇంటలిజెన్స్ హెచ్చరికల మేరకు చెన్నై అధికారులు అలర్ట్ అయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతీ కంటెయినర్ ను నిశితంగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. దీంతో హార్బర్ తీరం వెంబడి కి.మీ పొడుగునా ట్రాఫిక్ నిలిచిపోతున్నట్లు తెలుస్తోంది.
అదీగాక అధికారుల తనిఖీలతో ఎగుమతులు, దిగుమతుల్లో సైతం జాప్యం జరుగుతున్నట్లుగా వర్తకులు వాపోతున్నారు. రెండు రోజులుగా కేవలం కొద్దిమంది అధికారులతోనే గుట్టు చప్పుడు కాకుండా కంటెయినర్ల తనిఖీల మీద ఫోకస్ చేసిన కస్టమ్స్ అధికారులు.. ఆదివారం నుంచి తనిఖీలను ముమ్మరం చేశారు. వందలాది మంది అధికారులను తనిఖీల్లోకి దించారు.
చెన్నై హార్బర్ లో రెండు స్కానర్లు మాత్రమే ఉండటంతో ట్రాఫిక్ కష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఎగుమతి, దిగుమతులకు సంబంధించి కొన్నిరకాల వస్తువులు త్వరగా పాడైపోయే అవకాశం ఉండటంతో వాటిని త్వరితగతిన పంపించేందుకు చర్యలు తీసుకోవాలని హార్బర్ వర్గాలకు వర్తకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తనిఖీలతో కొత్త సమస్యలు తలెత్తుతుండటంతో కస్టమ్స్ అధికారులు వీలైనంత త్వరగా ఈ తతంగాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హర్బర్, కస్టమ్స్, ప్రత్యేక బృందాలు సమన్వయంగా వ్యవహరిస్తూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. తనిఖీలు పూర్తయిన కంటెయినర్లను జీరో గేట్ ద్వారా బయటకు పంపిస్తున్నారు.
కాగా, ఆర్కేనగర్ ఉపఎన్నిక నేపథ్యంలోనే ఈ వేల కొద్ది నకీలి నోట్లు హార్బర్ కు వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఇప్పటికే అక్కడక్కడ రూ.2వేల నకిలీ నోటు దర్శనమిస్తుండగా ఇప్పుడిలా భారీ మొత్తంలో నకిలీ నోట్లు వచ్చాయన్న వార్త సామాన్యులను సైతం కలవరపెడుతోంది. ఇప్పటికైతే నకిలీ నోట్ల కంటెయినర్ ను అధికారులు గుర్తించలేదు.