లష్కరే స్లీపర్ సెల్స్: షెల్టర్ జోన్ గా యూపీ?: వారణాసి, అయోధ్యల్లో ఆత్మాహూతి దాడులకు ప్లాన్
లక్నో: కరడుగట్టిన ఉగ్రవాద సంస్థగా ముద్ర పడిన లష్కరే తోయిబా.. ఉత్తర్ ప్రదేశ్ ను తన షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. లష్కరే తోయిబా స్లీపర్ సెల్స్.. పెద్ద సంఖ్యలో ఉత్తర్ ప్రదేశ్ లో వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారనే విశ్వసనీయ సమాచారం తమకు లభించిందని ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిని తమ టార్గెట్ గా చేసుకున్నారని, దీనితో పాటు అయోధ్య, గోరఖ్ పూర్ లపై ఆత్మాహూతి దాడులకు పాల్పడే అవకాశాలు లేకపోలేదని వారు హెచ్చరించారు.
కరవు నేలకు జలసిరి: హంద్రీనీవాకు చేరిన కృష్ణా వరద జలాలు!
ఎనిమిది నెలల వ్యవధిలో పదుల సంఖ్యలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు వారణాసి నగరాన్ని సందర్శించి, సురక్షితంగా వెనక్కి వెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. పాకిస్తాన్ జాతీయుడైన ఉగ్రవాది ఉమర్ మద్ని, నేపాల్కు చెందిన తన సహచరుడితో కలిసి మేలో వారణాసిలో మూడు రోజులు తలదాచుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఉమర్ మద్ని నేపాల్ గుండా భారత్ లోకి ప్రవేశించి ఉంటాడని అనుమానిస్తున్నారు.
లష్కరే తోయిబాలో ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకునే బాధ్యతలను ఉమర్ మద్నీ పర్యవేక్షిస్తున్నాడని ఇంటెలిజెన్స్ అధికారులు తమ నివేదికలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో వారణాసికి చెందిన కొందరు యువకులతో ఆయన సంప్రదించాడని, ఆ సంప్రదింపుల వల్లే అతను వారణాసికి చేరినట్లు తమకు ఇన్ ఫార్మర్ల ద్వారా తెలిసిందని అన్నారు. ఒక్క వారణాసిలోనే కాకుండా అయోధ్య, గోరఖ్ పూర్ లల్లో కూడా స్లీపర్ సెల్స్ ను ఏర్పాటు చేశాడని, ఏ క్షణమైనా భారీ దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.