మరణశిక్ష ఖైదీ వింత కోరికలు.. తీర్చలేదని జైలులో నిరాహార దీక్ష
మరణశిక్ష పడి కోల్ కతాలోని జైలులో ఉన్న ఓ లష్కరే తోయిబా ఉగ్రవాది తనకు నాణ్యమైన భోజనం, టీవీ సెట్ కావాలని డిమాండ్ చేస్తూ.. జైలులోనే నిరాహార దీక్షకు తెగబడ్డాడు.
కోల్ కతా: మరణశిక్ష పడి కోల్ కతాలోని జైలులో ఉన్న ఓ లష్కరే తోయిబా ఉగ్రవాది వింత కోరికలతో జైలు అధికారులను వేధిస్తున్నాడు. తన డిమాండ్లు తీర్చాలంటూ ఏకంగా జైలులోనే నిరాహారదీక్షకు దిగాడు.
జమ్ము కశ్మీర్ లోని అనంతనాగ్ కు చెందిన ముజఫర్ అహ్మద్ రాథెర్(30), మరో ఇద్దరు పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు 2007లో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రతా బలగాలకు చిక్కారు.
వీరు ముగ్గురు కలిసి జమ్ము కశ్మీర్ లో ఉగ్రదాడులకు పథకం రచించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నేరం రుజువు కావడంతో ఈ ఏడాది జనవరి నెలలో పశ్చిమ బెంగాల్ లోని బోన్ గావ్ కోర్టు వీరికి మరణశిక్ష విధించింది.
వీరిలో ముజఫర్ అహ్మద్ రాథెర్ ప్రస్తుతం డుమ్ డుమ్ జైలులో ఉన్నాడు. రెండ్రోజులుగా జైలులో నిరాహార దీక్ష సాగిస్తున్నాడు. నాణ్యమైన భోజనం, టీవీ సెట్, న్యూస్ పేపర్లు, పరుపు కావాలనేది అతగాడి డిమాండ్లు.
ఈ చర్యతో అతడిని జైలు అధికారులు ప్రెసిడెన్సీ జైలుకు తరలించారు. జైలు మార్పుతో అతడు నిరాహార దీక్ష విరమించాడని, ఖైదీలందరికీ తాము నాణ్యమైన భోజనాన్నే అందిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు.
నిబంధనల ప్రకారం మరణశిక్ష పడిన ఖైదీకి టీవీ సెట్ సమకూర్చడానికి వీలవదని, అయితే కొన్నిసార్లు జైలు అధికారులపై ఒత్తిడి పెంచేందుకు మావోయిస్టులు, కరుడుగట్టిన నేరగాళ్లు ఇలాంటి ట్రిక్కులకు పాల్పడుతుంటారని వారు వివరించారు.