జైల్లో చివరి రోజు: బిజీగా తల్వార్ దంపతులు, ఏ తప్పూ చేయకుండానే నాలుగేళ్లుగా...
కూతురుని హత్య చేసిన కేసులో నిర్దోషులుగా బయటపడిన రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్ దంపతులు ఆదివారం దాస్నా జైలులో బిజీగా గడిపేశారు. జైలులోని పలువురు ఖైదీలకు దంతపరీక్షలు చేశారు.
ఘజియాబాద్ : దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఢిల్లీ బాలిక ఆరుషి, వాచ్మన్ హేమరాజ్ల హత్య కేసు చివరకు దోషులెవరో తేలకుండానే ముగిసిపోయింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలంలో ఊహించని మలుపులు తిరిగిన ఈ కేసులో ఆమె తల్లిదండ్రులు నూపూర్ తల్వార్, రాజేష్ తల్వార్లే ప్రధాన నిందితులంటూ ఆరోపించిన సీబీఐ చివరకు దాన్ని నిరూపించలేకపోవడంతో... అలహాబాద్ హైకోర్టు గురువారం ఆ దంపతులిద్దరినీ 'సంశయ లబ్ధి' కింద విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కూతురుని హత్య చేసిన కేసులో నిర్దోషులుగా బయటపడిన రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్ దంపతులు ఆదివారం దాస్నా జైలులో బిజీగా గడిపేశారు. జైలులోని పలువురు ఖైదీలకు దంతపరీక్షలు చేశారు. తల్వార్ దంపతులు స్వయంగా దంతవైద్యులు కావడంతో జైలులోని క్లినిక్ ఆదివారం ఖైదీలతో కిక్కిరిసిపోయింది. తమ దంత సమస్యలు చూపించుకునేందుకు జైలు సిబ్బందితోసహా బారులు తీరారు. దీంతో ఆదివారమైనా వారు విశ్రాంతి లేకుండా జైలులో గడిపారు.

నిర్దోషులైనా జైల్లో...
మన దర్యాప్తు సంస్థల పనితీరుకు, ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో కేసుల విచారణకు.. నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది ఆరుషి హత్య కేసు. కూతుర్ని పోగొట్టుకుని పుట్టెడు దు:ఖంలో ఉన్న తల్వార్ దంపతులను దోషులుగా చేసింది సీబీఐ న్యాయస్థానం. దీంతో వారు ఏళ్ల తరబడి జైల్లోనే మగ్గాల్సి వచ్చింది.

అదే వారిపాలిట శాపమైంది...
ఆరుషి హత్య కేసును తొలుత విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా ఇందులో ఎలాంటి ఆధారాలూ లభించలేదని అంగీకరించింది. కానీ ‘పరిస్థితులు పట్టి ఇచ్చే సాక్ష్యాల' ఆధారంగా ఆరుషి తల్లిదండ్రులనే దోషులుగా నిర్ధారిస్తున్నట్టు 2013 నవంబర్లో తెలిపింది. చిత్రమేమిటంటే.. ఈ కేసులో తమకు ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదు గనుక కేసును మూసేయాలని 2010 డిసెంబర్లో న్యాయస్థానాన్ని సీబీఐ అభ్యర్థిస్తే.. అందుకు అభ్యంతరం చెబుతూ అప్పీల్కెళ్లింది తల్వార్ దంపతులే. తమ కుమార్తెను చంపిన వారికి శిక్షపడాలని వారు పోరాటం మొదలుపెట్టి చివరికి వారే శిక్ష అనుభవించాల్సిన దుస్థితిలో పడిపోయారు.

ఎడా పెడా కథనాలతో...
నిజాలను వెలుగులోకి తీసుకురావలసిన మీడియా కూడా పోలీసుల లీకులను కథనాలుగా మార్చి ప్రచురిస్తూ ఆరుషి తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదనను మిగిల్చింది. ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రుల ప్రమేయం ఉందని ‘నిరూపించడం' కోసం ఆ కుటుంబాన్ని మీడియా బజారులో నిలబెట్టింది. విలువలను విస్మరిస్తూ అనేక కథనాలను ప్రచారంలోకి తెచ్చింది. ఆరుషి తండ్రి రాజేష్ తల్వార్కు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉందని ఒక కథనంలో రాస్తే.. మరో కథనంలో.. ఆ దంపతులు కూతుర్ని ఒంటరిగా వదిలేసి విందుల పేరుతో ఎక్కడెక్కడికో తిరిగి వచ్చేవారని రాసింది.

వారి పోరాటం, పడిన మనోవేదన...
తమ కుమార్తెను హత్య చేసిన వారిని పట్టి శిక్షించమని పోలీసులను ఆశ్రయించిన తల్వార్ దంపతులే చివరికి దోషులుగా జైలు శిక్ష అనుభవించారు. దీనికి కారణం ఎవరు? పోలీసులా? దర్యాప్తు సంస్థలా? న్యాయస్థానమా? నిందితులకు శిక్ష పడాలని పోరాడిన వారినే శిక్షించిన వ్యవస్థ మనది. తమనే దోషులుగా మార్చివేయడంతో ఆ తరువాత సుప్రీం కోర్టు వరకు వివిధ సందర్భాలలో వారు సాగించిన పోరాటం, పడిన మనోవేదన అంతా ఇంతా కాదు. కూతుర్ని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు ఓదార్పు లభించడం మాట అటుంచి ఊహించని ఇబ్బందులు చుట్టుముట్టాయి. చివరకు నాలుగేళ్లకు వారిద్దరూ నిర్దోషులుగా బయటికొచ్చారు గానీ... తమ కూతురి ఉసురు తీసిందెవరో మాత్రం నేటికీ తెలియలేదు.

సమాధానం లేని ప్రశ్నలెన్నో...
ఆరుషికి సంబంధించి మెడ కోసిన ఆనవాలు తప్ప నెత్తురొలికిన జాడలేదు. అంటే ఆ రక్తపు మరకల్ని ఎవరో శుభ్రం చేసి ఉండాలి. అలా చేసిందెవరో పోలీసులు తేల్చలేకపోయారు. తల్వార్ దంపతులే ఆ పని చేసి ఉండొచ్చునని భావించినా అందుకు ఎలాంటి ఆధా రాలనూ చూపలేకపోయారు. రాజేష్ తల్వార్ సహాయకుడు కృష్ణ, ఇంట్లో పనిచేసే రాజ్కుమార్, విజయ్మండల్ అనే మరో ఇద్దరు యువకుల్ని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. కానీ ఏమీ రాబట్టలేకపోయారు. ఈ కేసును సీబీఐకి అప్పగించినా ఫలితం లేకపోయింది. హత్య జరిగిన ప్రదేశాన్ని పోలీసులు వెనువెంటనే స్వాధీనం చేసుకోనందువల్ల నేరస్తుల వేలిముద్రలు, ఇతర ఆధారాలు చెదిరిపోయాయి. ఆరుషినీ, హేమ రాజ్నూ అభ్యంతరకర పరిస్థితుల్లో చూసిన తల్వార్ దంపతులు కోపం పట్టలేక ఆ బాలికను ‘పరువు హత్య' చేశారని ఆరోపించినా ఆరుషి గదిలో ఆమె శవం మాత్రమే ఎందుకున్నదో, హేమరాజ్ శవం టెర్రస్పైకి ఎలా చేరిందో సీబీఐ చెప్పలేకపోయింది.

జైలుశిక్ష అనుభవిస్తూ కూడా...
వైద్యులైన నుపుర్ తల్వార్, రాజేష్ తల్వార్ జైలుశిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆదివారం క్లినిక్ కి వచ్చేవాళ్లు కాదు. అయితే, ఈ ఆదివారమే వారికి జైలులో చివరి రోజు కావడంతో రొటీన్ కి భిన్నంగా వారు ఆదివారం కూడా క్లినిక్ కు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఖైదీలు పెద్ద మొత్తంలో క్లినిక్ వద్ద బారులు తీరారు. రాజేష్ పురుష ఖైదీలకు వైద్యం చేయగా నుపుర్ మహిళా ఖైదీలకు వైద్య సేవలు చేసింది..' అని జైలు అధికారులు తెలిపారు.

అది వారి ప్రతిఫలం... అయినా వద్దన్నారు..
దాస్నా జైలులో నాలుగేళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన తల్వార్ దంపతులు జైలులోని క్లినిక్ లో ఖైదీకు వైద్య చికిత్సలు అందించే వారన్న సంగతి తెలిసిందే. ఇలా వారు చేసిన ఈ పనికి వారికి రూ.49,500 ప్రతిఫలం దక్కింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో విడుదలకానున్న వారికి ఆ డబ్బును జైలు అధికారులు ఇవ్వబోగా వారు సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయాన్ని దాస్నా జైలు సూరింటెండెంట్ దధీరాం మౌర్య తెలిపారు. తాము నిర్దోషులమని తేలినా, చివరి రోజైన ఆదివారం తల్వార్ దంపతులు తోటి ఖైదీలతోపాటు పప్పు అన్నమే తిన్నారని ఆయన వివరించారు.

ఖైదీల కోసం...
తమ కూతురు ఆరుషిని, పని మనిషి హేమ్ రాజ్ను హత్యచేసిన కేసులో తల్వార్ దంపతులు నిర్దోషులని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరు విడుదల కావాల్సి ఉండగా ఆదివారం కావడంతో వారి విడుదల సోవారానికి వాయిదా పడింది. దీంతో చివరిరోజైన ఆదివారం.. తల్వార్ దంపతులు రోజంతా జైలులోని తోటి ఖైదీలకు దంత వైద్య సేవలు అందించారు. అంతేకాదు, తాము నిర్దోషులుగా విడుదలైనా ప్రతి రెండు వారాలకు ఒకసారి జైలుకొచ్చి ఖైదీలకు దంత వైద్య చికిత్సలు అందిస్తామని చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications