పెద్ద పులుల మధ్య పోట్లాట: వీరూ దుర్మరణం: కళేబరానికి అంత్యక్రియలు..శాస్త్రోక్తంగా!
జైపూర్: రాజస్థాన్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రెండు పెద్ద పులుల మధ్య భీకరంగా చోటు చేసుకున్న పోరాటంలో వీరూ అనే టైగర్ మరణించింది. తీవ్రంగా గాయాలపాలైన వీరూ సుమారు 48 గంటల పాటు మృత్యువుతో పోరాడింది. సరైన సమయంలో అటవీ శాఖ సిబ్బంది స్పందించి, దానికి చికిత్స చేయించి ఉంటే జీవించి ఉండేదని పులుల సంరక్షణ కోసం కృషి చేస్తోన్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పెద్ద పులి కళేబరానికి అటవీశాఖ అధికారులు దహన సంస్కారాలను నిర్వహించారు. శాస్త్రోక్తంగా అంత్యక్రియలను చేపట్టారు.
రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో విస్తరించిన రణథంబోర్ నేషనల్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రణథంబోర్ నేషనల్ పార్క్ లోని పులుల సంరక్షణ కేంద్రంలో టీ-42, టీ-109 అనే పులులు రెండు రోజుల కిందట హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఘటనలో టీ109 వీరూ అనే పెద్ద పులి తీవ్రంగా గాయపడింది. దీన్ని గుర్తించిన రణథంబోర్ నేషనల్ పార్క్ సిబ్బంది ట్రాన్క్విలైజర్ల ద్వారా దాన్ని బంధించారు. చికిత్స చేయించిన అనంతరం మళ్లీ పార్క్ లోనే వదిలి పెట్టారు. ఆ తరువాత దాని ఆరోగ్యం గురించి పట్టించుకోలేదని పులుల సంరక్షణా సంస్థల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.


గాయాలు తిరగబెట్టడంతో గురువారం అది కన్నుమూసింది. పులి కళేబరానికి అధికారులు పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలను నిర్వహించారు. దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వుడ్ జోన్ గా గుర్తింపు ఉన్న రణథంబోర్ నేషనల్ పార్క్ 392 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది.

బఫర్ జోన్ ను కూడా కలుపుకొంటే దీని విస్తీర్ణం 1300 చదరపు కిలోమీటర్ల పైమాటే. కొద్దిరోజుల వ్యవధిలో పెద్ద పులి మృత్యువాత పడటం ఇది మూడోసారి. అనారోగ్య కారణాలతో రెండు పులులు మరణించాయి. తాజాగా ఇంకో ఉదంతం చోటు చేసుకోవడం పట్ల పులులు సంరక్షణా సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications