మోడీ సీతయ్య: లేట్ కమ్మర్స్కు షాక్, డోర్స్ క్లోజ్
న్యూఢిల్లీ: సమావేశానికి ఆలస్యంగా వచ్చినవారికి ప్రధాని నరేంద్ర మోడీ షాక్ ఇచ్చారు. పార్లమెంటు ఆవరణలో మంగళవారం జరిగి బిజెపి పార్లమెంటు సభ్యుల సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారికి తలుపులు మూసేశారు. సమయానికి సమావేశానికి రావాలని ఆయన పార్లమెంటు సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలస్యంగా వచ్చినవారికి అనుమతి నిరాకరిస్తూ తలుపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలోని బాలయోగి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఈ అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశానికి ఏకంగా 20 మంది ఎంపీలు ఆలస్యంగా వచ్చారు. ఆలస్యంగా వచ్చిన వారికి హాలులోకి వచ్చేందుకు ప్రవేశం కల్పించవద్దని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో వారంతా ఆడిటోరియం వెలుపల తచ్చాడుతూ కనిపించారు.
ఇకపై ప్రతి మంగళవారం ఉదయం గం. 9.35 నిమిషాలకు ఒక్క క్షణం ఆలస్యమైనా పార్టీ ఎంపిలు పార్లమెంట్ సముదాయంలోని బాలయోగి ఆడిటోరియం లోపలికి అనుమతి లభించదు. దశలవారీగా మిగతా సమావేశాల్లోనూ ఈ నిబంధన అమలులోకి రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తం బీజేపీ ఎంపీలను క్రమశిక్షణలో పెట్టేందుకు నరేంద్ర మోడీ నడుం బిగించినట్టున్నారు. బహిరంగ ప్రసంగాల్లోనే కాక మాటతీరులోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ నేతలకు ఆయన ఇప్పటికే సూచనలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా సమయపాలన కూడా పాటించాల్సిందేనని పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేయడంతో వారంతా షాక్కు గురయ్యారు.
వారం గ్యాప్ తర్వాత మోడీ పార్లమెంటు సభ్యుల సమావేశానికి హాజరయ్యారు. గత మంగళవారం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నెలకు ఒకసారి సమావేశానికి హాజరవుతారు. క్రమశిక్షణతో మెలగాలని, ఏ సమావేశానికి కూడా గైర్హాజరు కాకూడదని మోడీ మొదట్లోనే పార్లమెంటు సభ్యులకు సూచించారు.