డిజిటల్ ఇండియా పుణ్యం: లక్కీ డ్రాలో ఇంజనీరింగ్ విద్యార్థినికి రూ.1కోటి
ఈ రెండు స్కీముల కింద మొత్తం 16మంది లక్కీ విజేతలు రూ.258కోట్లు గెలుచుకున్నారు. దీనికి సంబంధించిన విజేతలను లక్కీ డ్రా ద్వారా ప్రధాని మోడీ ఎంపిక చేశారు.
నాగ్పూర్: డిజిటల్ ఇండియాలో భాగంగా దేశాన్ని నగదు రహితంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు డిజిటల్ లావాదేవీల్లో భాగస్వాములయ్యేవారికి లక్కీ డ్రా బహుమతుల పథకాన్నికేంద్రం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్ యోజన స్కీమ్ కింద తాజాగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని రూ.1కోటి బహుమతి గెల్చుకుంది.
మహారాష్ట్ర లాతూర్ కు చెందిన శ్రద్దా అనే అమ్మాయిని ఈ అదృష్టం వరించింది. శ్రద్దా ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. శ్రద్ద తన మొబైల్ ఫోన్ ఈఎంఐ చెల్లింపుల కోసం రూపే కార్డును ఉపయోగించి ఆన్ లైన్ ద్వారా రూ.1590 చెల్లించింది. ఈ క్రమంలో ఆమె లక్కీ గ్రాహక్ యోజన స్కీమ్ కింద లక్కీ విజేతగా ఎంపికైంది.
లక్కీ విజేతగా ఎంపికైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆమెకు సన్మానం జరిగింది. కాగా, నగదు రహిత చెల్లింపుల ప్రోత్సహించే క్రమంలో లక్కీ గ్రాహక్ యోజన మరియు డిజీ ధన్ వ్యాపార్ యోజన పథకాలను కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ రెండు స్కీముల కింద మొత్తం 16మంది లక్కీ విజేతలు రూ.258కోట్లు గెలుచుకున్నారు. దీనికి సంబంధించిన విజేతలను లక్కీ డ్రా ద్వారా ప్రధాని మోడీ ఎంపిక చేశారు. లక్కీ గ్రాహక్ యోజన కింద రెండో లక్కీ విజేతగా హార్థిక్ కుమార్ అనే గుజరాత్ కు చెందిన వ్యక్తి ఎంపికయ్యారు. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న ఈయన రూ.1100ను రూపే కార్డు ద్వారా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ చేయడంతో ఈ బహుమతికి ఎంపికయ్యారు.
ఇక కేవలం రూ.100 ట్రాన్సాక్షన్ జరిపిన భరత్ సింగ్ అనే ఉత్తరాఖండ్ వ్యక్తిని సైతం రూ.25లక్షల ప్రైజ్ మనీ వరించడం విశేషం. ఇక డిజీధన్ వ్యాపార్ యోజన పథకం కింద ఆనంద్ అనంతపద్మనాభన్ అనే వ్యక్తికి రూ.50లక్షల ప్రైజ్ మనీ లభించింది. రాగిని రాజేందర్ అనే మహారాష్ట్రకు చెందిన బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలికి రూ.25లక్షల ప్రైజ్ మనీ వరించింది.