గాలి కుమార్తె పెళ్లిని తలదన్నేలా!.. కర్ణాటకలో మరో భారీ వివాహ తంతు
బెంగుళూరు : మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహం నిన్న మొన్నటిదాకా వార్తల్లో ఎంతగా నానిందో అందరికీ తెలిసిందే. నోట్ల రద్దు అంశం కూడా తోడవడంతో.. పెళ్లి పూర్తయ్యేంతవరకు ఏదో ఒక వార్త మీడియాలో హైలైట్ అవుతూనే వచ్చింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ నేత రమేష్ జర్కిహొలి వంతు.
రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల మంత్రి అయిన రమేష్ జర్కిహొలి తన కుమారుడి వివాహాన్ని గాలి కుమార్తె వివాహాన్ని తలదన్నే రీతిలో ప్లాన్ చేస్తున్నారని కర్ణాటక అంతటా జోరుగా చర్చ జరుగుతోంది. గోకక్ పట్టణంలో ఆదివారం నాడు జరగబోయే ఈ పెళ్లి కోసం ఏకంగా రెండు ఎకరాల్లో కళ్యాణ మంటపాన్ని నిర్మిస్తుండడం విశేషం.

రెండు ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ పెళ్లి మంటపం పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ కావడం గమనార్హం.కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని పోలి ఉండేలా పెళ్లి మంటపాన్ని డిజైన్ చేస్తున్నారు. ఇక వచ్చే పోయే వీవీఐపీల కోసం పట్టణ శివారు ప్రాంతంలో హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. దాదాపు లక్ష మందికి పైగా ఈ పెళ్లికి హాజరవుతారని భావిస్తుండగా.. కాంగ్రెస్ హైకమాండ్ సైతం పెళ్లికి హాజరవుతారని చెబుతున్నారు.
ప్రస్తుతం గోకక్ పట్టణంలో ఎక్కడ చూసినా.. పెళ్లికి సంబంధించిన కటౌట్లు, బ్యానర్లే దర్శనమిస్తున్నాయి. మొత్తానికి దేశమంతా నోట్ల రద్దు కష్టాల్లో ఉంటే.. బడా పెళ్లిళ్ల ఏర్పాట్లకు మాత్రం ఆ ఎఫెక్ట్ ఇసుమంత కూడా కనిపించకపోవడం గమనార్హం. ఇక నిన్నటిదాకా గాలి కుమార్తె వివాహంపై పలు ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు సొంత పార్టీ నేత విషయంలో ఎలా వ్యవహరిస్తుందో మరి!












Click it and Unblock the Notifications