ఇదేం ఖర్మరా బాబూ: వరుడు ముంబైలో..వధువు బరేలీలో..పూజారి రాయ్పూర్లో..పెళ్లి మాత్రం జరిగింది, హౌ ?
పెళ్లి అంటే అదో పెద్ద పండగ. ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి కుటుంబ సభ్యులు బంధు మిత్రుల మధ్య ఘనంగా జరిగే వేడుక. బాజా భజంత్రీలు, పండితుల పవిత్రమంత్రాల మధ్య రెండు మనసులు ఒక్కటయ్యే వేడుక. ఇదంతా ఒకప్పుడు. కాలం మారుతున్న కొద్దీ పద్ధతులు మారాయి. అయితే ఒకప్పుడు ఇంటి బయటే పందిరి వేస్తుండగా ఆ తర్వాత పెళ్లిళ్ల వేడుకలు ఫంక్షన్ హాలుకు మారాయి. అదే స్థాయిలో గ్రాండ్గా వివాహాలు జరిగేవి. కానీ కరోనావైరస్ రావడం దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోవడం సామాజిక దూరం పాటించాలన్న నిబంధన రావడంతో ఫంక్షన్ హాళ్ల నుంచి మొబైల్ ఫోన్లకు ఎక్కాయి పెళ్లిళ్లు.
లాక్డౌన్ వేళ ఆన్లైన్ పెళ్లిళ్లు
సాధారణంగా వివాహం చేసుకోవాలని ఆశపడే జంట వారి పెళ్లి ఇలా జరగాలి అలా జరగాలంటూ కలలు కంటారు. . కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు వివాహాలు జరుగుతున్నాయి.అవును.. ఓ వైపు కరోనా కాటేస్తుండగా మరోవైపు మంచి ముహూర్తం మించిపోతుందని భావిస్తున్నవారు పెళ్లి వేడుకను ఇంట్లోనే కొందరి మధ్యే కానిచ్చేస్తూ సోషల్ మీడియా యాప్స్ ద్వారా బంధువులకు లైవ్ చూపిస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ ఇలా మారింది. బంధువులు ఉండరు, మిత్రులు ఉండరు కానీ ఏం చేద్దాం ముహూర్తం మించిపోతే మళ్లీ మంచి ముహూర్తం రాదు కదా అని చెప్పి ఇళ్లల్లోనే పెళ్లిళ్లు చాలా సింపుల్గా కానిచ్చేస్తున్నారు. బంధువులకు పలు సోషల్ మీడియా యాప్స్ ద్వారా వివాహ వేడుకను చూపిస్తున్నారు. వాస్తవంగా దీనివల్ల చాలా ఖర్చు మిగిలిపోతోందని కూడా సంతోషించేవారు లేకపోలేదు. భోజనాల ఖర్చు, ఫంక్షన్ హాల్ ఖర్చు, వచ్చే అతిథులకు ఏర్పాటు చేయాల్సిన గదుల ఖర్చు ఇలా చాలా వరకు మిగిలిపోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి వెడ్డింగ్స్ను టెలికాస్ట్ చేసేందుకు జూమ్ యాప్ను వినియోగిస్తున్నారు.
జూమ్ యాప్లో వివాహ వేడుక తంతు
ఇక్కడ జూమ్ యాప్ను ఆధారం చేసుకుని ఓ వివాహం జరిగింది. పెళ్లికొడుకు సుషేన్ డాంగ్ ముంబైలోని తన నివాసంలో ఉండగా అతని కాబోయే భార్య కీర్తి నారంగ్ యూపీలోని బరేలీలో ఉంది. ఇక పెళ్లి వేడుకను జరిపించాల్సిన పురోహితుడు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఉన్నాడు. ఇక అగ్ని ముందు ఆ పురోహితుడు మంత్రాలు చదువుతుండగా డిజిటల్ పద్ధతి ద్వారా పెళ్లి కుమార్తె తండ్రిని కన్యాదానం చేయాల్సిందిగా సూచించారు. ఇక ఈ తంతు అంతా జూమ్ యాప్ ద్వారా జరిగింది. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడి బంధువులంతా జూమ్ యాప్ ద్వారా ఈ వేడుకను వీక్షించి కొత్త దంపతులను డిజిటల్ పద్ధతి ద్వారానే ఆశీర్వదించారు. తమ వివాహం ఇలా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని పెళ్లికొడుకు సుషేన్ డాంగ్ చెప్పాడు.
Recommended Video
ఆన్లైన్ పెళ్లికి తగ్గే భారీ ఖర్చులు
ఇదిలా ఉంటే లాక్డౌన్ నేపథ్యంలో పెళ్లిళ్ల ద్వారా వచ్చే రెవిన్యూ పూర్తిగా దెబ్బతింది. ఒక్క పెళ్లిళ్ల వేడుకల ద్వారా 70 బిలియన్ డాలర్లు రెవిన్యూ వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఆవిరైంది. ఇక తాజాగా జూమ్ యాప్, యూట్యూబ్, గూగుల్ హ్యాంగ్ఔట్స్ ద్వారా వివాహాలు జరుగుతున్నందున హోటల్స్ ఖర్చులు మిగిలిపోయాయి. వివాహ వేడుకలకు అధిక ఖర్చులు చేయకుండా అడ్డుకోవాలని భావిస్తున్న ప్రభుత్వంకు ఒకరకంగా వైరస్ సహాయపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డబ్బులు ఉన్నవారు డబ్బులు లేని వారు కూడా వివాహాన్ని ఘనంగా చేయాలని భావిస్తారు. పెళ్లి కోసం భారీగా అప్పు తీసుకొచ్చైనా పెళ్లి చేయాలని భావించే కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఆ తర్వాత ఇబ్బందులు కూడా పడుతుంటారు. అలాంటి వారికి డిజిటల్ పద్ధతి ద్వారా వివాహాలు జరపడం ఖర్చు పరంగా చూస్తే ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గతేడాది తన కూతురు ఇషా అంబానీ వివాహం కోసం 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అతిథులకు ప్రత్యేక ప్రైవేట్ జెట్లు పంపారు. అంతేకాదు బియాన్స్ సంగీత విభావరి, టాప్ బాలీవుడ్ సెలబ్రిటీలు కొరియోగ్రఫీ చేసిన సంగీత్ కార్యక్రమానికి భారీగా డబ్బును వెదజల్లారు ముఖేష్ అంబానీ.