18 తర్వాతే: టీ బిల్లుకు న్యాయశాఖ పచ్చజెండా
లోకసభ సచివాలయం బుధవారం ఉదయం తెలంగాణ బిల్లుపై న్యాయ మంత్రిత్వ శాఖ అభిప్రాయాన్ని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, ఆర్టికల్ 4(20) తమ అభిప్రాయాన్ని బలపరుస్తున్నట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి సాధారణ చట్టాన్ని తేవడానికి కేంద్ర మంత్రివర్గానికి జివోఎం సూచనలు చేసిందని చెప్పింది. ఈ నెల 18వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాతనే తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బిల్లులో పలు న్యాయపరమైన చిక్కులున్నాయని బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ అన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అలాగే, తెలంగాణలో శాసనమండలిని కొనసాగించాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తాకథనం కూడా కలకలం రేపింది.
రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని మాట లేదని, ఉమ్మడి రాజధాని ఏర్పాటు అనేది రాజ్యాంగ విరుద్ధమని గత కొంత కాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు కొనసాగించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆ విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సీమాంధ్ర ప్రజలు శాంతించేలా కొన్ని స్పష్టమైన, నిర్దిష్టమైన హామీలు ఇవ్వాలని బిజెపి కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. విభజన సమస్యను నాన్చడం సరి కాదనే అభిప్రాయంతో ఆ పార్టీ ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఎలా వ్యవహరిస్తోందనే విషయాలపై బిజెపి వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు సమాచారం.