కాశ్మీర్ ఎప్పటికీ మాదే: మా నుంచి ఎవరూ విడదీయలేరు: జమాత్ ఉలేమా హింద్ చీఫ్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ తమదేనని ప్రముఖ ఇస్లామిక్ సంస్థ జమాత్ ఉలేమా హింద్ ప్రకటించింది. భారత్ నుంచి జమ్మూ కాశ్మీర్ ను ఎవ్వరూ విడదీయలేరని, ఆ రాష్ట్రం మనదేశంలో అంతర్భాగమని స్పష్టం చేసింది. భారత్ లో నివసించే ముస్లింలో స్వదేశానికి వ్యతిరేకమని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి పాకిస్తాన్ తెగ ఆరాటపడుతోందని జమాత్ ఉలేమా హింద్ చీఫ్ మహమూద్ మడాని ఎద్దేవా చేశారు. అలాంటి ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరబోవని అన్నారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తరువాత ఓ ఇస్లామిక్ సంస్థ ఆ అంశంపై స్పందించడం ఇదే తొలిసారి. ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు తాము కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని మడాని వెల్లడించారు.
కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని అంటూ జమాతే ఉలేమా సంస్థ గురువారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ రాష్ట్రాన్ని వేర్పాటు వాద రాజకీయాలకు వాడుకోకూడదని సూచించింది. భారత్ లో నివసించే ప్రతి ముస్లిం కూడా కాశ్మీర్ ను తమ సొంత రాష్ట్రంగా భావించాలని కోరారు. భారత ఆక్రమిత కాశ్మీర్ గా పాకిస్తాన్ ఇన్నాళ్లూ గుర్తిస్తూ వచ్చిందని, ఇకపై అలాంటి ప్రయత్నాలు చేయడాన్ని మానుకోవాలని మడానీ సూచించారు. జమాత్ ప్రతినిధుల సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాశ్మీర్ విషయంలో కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ తీసుకునే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉన్నామని, వాటిని స్వాగతిస్తున్నామని చెప్పారు. కాశ్మీర్ హమారా థా..హమారా హై..హమారా రహేగా.. అని మహమూద్ స్పష్టం చేశారు.

కాశ్మీరీ ప్రజల సంక్షేమానికి కేంద్రం చిత్తశుద్ధితో పని చేయాలని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. కాశ్మీరీలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని, వారి సంప్రదాయాలు, వేషభాషలు భారత్ లోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమని అన్నారు. వారి ప్రత్యేకతను కోల్పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాము కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు. భారత్ లోని ముస్లింల మధ్య చిచ్చు పెట్టి, దేశ అంతర్గత భద్రతను రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని అన్నారు. వాటిని తాము సాగనివ్వబోమని మడాని స్పష్టం చేశారు. భారత్ లో నివసించే ప్రతి ముస్లిం కూడా భారతీయుడేనని చెప్పారు.

జమ్మూ కాశ్మీర్ ను తన యుద్ధ క్షేత్రంగా మార్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, ఈ దిశగా ఇప్పటికే అనేక కుట్రలు చేసిందని అన్నారు. భారత ముస్లింలో సమష్టిగా పాకిస్తాన్ పన్నాగాలను అడ్డుకోవాలని చెప్పారు. భారత ముస్లింలు స్వదేశానికి వ్యతిరేకంగా ఉన్నారనే సందేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, దీన్ని తిప్పి కొడతామని అన్నారు.
#WATCH Mahmood Madani, Jamiat Ulema-e-Hind: Kashmir hamara tha, hamara hai, hamara rahega. Jahan Bharat hai wahin hum. pic.twitter.com/mSsrxEYGAm
— ANI (@ANI) September 12, 2019












Click it and Unblock the Notifications