ఐసీయూలో లతా మంగేష్కర్: కరోనా పాజిటివ్: హెల్త్ బులెటిన్: ప్రార్థించాలంటూ కోరిన కుటుంబం
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇదివరకటి కంటే వేగంగా విస్తరిస్తోంది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ దీనికి తోడైంది. ఒమిక్రాన్ వల్లే దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోందంటూ నిపుణులు సైతం హెచ్చరించారు. దేశంలో పలు నగరాల్లో థర్డ్వేవ్ మొదలైందనే భయాందోళనలు నెలకొని ఉన్నాయి. ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూలు అమల్లో ఉంది.

థర్డ్వేవ్ ఎఫెక్ట్..
తాజా బులెటిన్ ప్రకారం..ఒక్కరోజులోనే 1,68,063 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 277 మంది మరణించారు. 69,959 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,58,75,790కు చేరింది. ఇందులో 3,45,70,131 డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు ఎనిమిది లక్షలను దాటాయి. యాక్టివ్ కేసులు 8,21,446గా రికార్డయ్యాయి. 4,84,213 మంది ఇప్పటిదాకా మహమ్మారి బారిన పడి ప్రాణాలొదిలారు. పాజిటివిటీ రేటు 10.64 శాతంగా నమోదైంది. ఇవన్నీ దేశంలో థర్డ్వేవ్ మొదలైందనే హెచ్చరికలను పంపించాయి.

పాజిటివ్గా తేలడంతో ఐసీయూకు
తాజాగా- లెజెండరీ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్కు కరోనా వైరస్ సోకింది. రెండు రోజులుగా జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. జ్వరం తీవ్రమైంది. దీనితో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు డాక్టర్లు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై త్వరలో బులెటిన్ వెలువడే అవకాశం ఉంది.

నిలకడగా ఆరోగ్యం..
లతా మంగేష్కర్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించినట్లు మేనకోడలు రచన తెలిపారు. కోవిడ్ లక్షణాలు స్వల్పంగా మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. లతా మంగేష్కర్ వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని అన్నారు. ముందు జాగ్రత్త కోసమే ఐసీయూకు షిఫ్ట్ చేసినట్లు డాక్టర్లు తెలిపారని చెప్పారు. లతా మంగేష్కర్ ఆరోగ్యంపై ఎలాంటి వదంతులు పుట్టించ వద్దని విజ్ఞప్తి చేశారు. ఆమె త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కావాలంటూ ప్రార్థనలు చేయాలని రచన కోరారు.

92 సంవత్సరాల లతాజీ..
లతా మంగేష్కర్ వయస్సు 92 సంవత్సరాలు. గత ఏడాది సెప్టెంబర్లో 92వ జన్మదిన వేడుకలను జరుపుకొన్నారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్నారు. చలన చిత్ర పరిశ్రమలో అత్యున్నత అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే, ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారం ఆఫీసర్ ఆఫ్ ద లీజియన్ హానర్ను అందుకున్నారు. దాదాపు అన్ని భాషల్లోనూ వేలకొద్దీ పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, గుజరాతీ, మరాఠీ.. ఇలా అన్ని భాషల చలనచిత్ర పరిశ్రమకు సేవలను అందించారు.

ఫిల్మ్ ఇండస్ట్రీపై పంజా..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు కోవిడ్ సోకిన విషయం తెలిసిందే. ఫలితంగా- తన సోదరుడు రమేష్ బాబు అంత్యక్రియలకు సైతం ఆయన హాజరు కాలేకపోయారు. హాస్యకిరీటి రాజేంద్రప్రసాద్ కరోనా వైరస్ దాడికి గురయ్యారు. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్, మంచు లక్ష్మీ, ఖుష్బూ, శోభన, త్రిష, సత్యరాజ్.. ఇలా చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు థర్డ్వేవ్లో కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా- జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, కుమారుడు అకీరా నందన్ ఈ మహమ్మారి బారిన పడ్డారు.












Click it and Unblock the Notifications