Vandalur Zoo Chennai: మగ సింహం మృతి...కరోనావైరస్ మహమ్మారే కాటేసిందా?
చెన్నై: ఇప్పటి వరకు మనుషుల ప్రాణాలనే తీసిన కరోనావైరస్ మహమ్మారి ఇప్పుడు జంతువులకు కూడా వ్యాపించి వాటినీ బలితీసుకుంటున్నాయి. తాజాగా, తమిళనాడులోని వందలూరు అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్లో కరోనాబారినపడి ఓ మగ సింహం మృతి చెందిందని జూ అధికారులు వెల్లడించారు.
జూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన సింహం నమూనాలను భోపాల్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీసెస్కు పంపించినట్లు చెప్పారు. కరోనా పాజిటివ్ అని సంస్థ ఇచ్చిన రిపోర్టు తేల్చిందని వెల్లడించారు.
'అయితే, ఇది కూడా తప్పుడు పాజిటివ్ కావచ్చు, ఇతర-అనారోగ్యాల కారణంగా జంతువు చనిపోయి ఉండవచ్చు. మేము ఇనిస్టిట్యూట్ రెండవ నమూనాను పంపలేదు' అని జూ అధికారి ఒకరు తెలిపారు.
వారం రోజుల క్రితం జూలోని మగ సింహం అస్వస్థతకు గురైంది. దీంతో కరోనా సోకిందనే అనుమానంతో దాని నమూనాలను భోపాల్లోని సంస్థకు పంపించారు. మరికొన్ని సింహాల నమూనాలు కూడా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో సింహాలకు కరోనా సోకిందా? లేక ఇంకేదైనా వ్యాధి బారిన పడ్డాయా? అనేదాన్ని తేల్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నాయి.
కాగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి లాక్డౌన్ ప్రకటించిననాటి నుంచీ ఈ జూ మూసివేశారు. కాగా, మే నెలలో హైదరాబాద్ జూలోని ఎనిమిది సింహాలు కరోనా బారినపడటం గమనార్హం. కరోనా మనుషుల నుంచి జంతువులకు వ్యాప్తి చెందుతోందని, అయితే, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందా? అనేదానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.