షాకింగ్: చెన్నై జూలోని నాలుగు సింహాలకు సోకిన కరోనా డెల్టా వేరియంట్
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్లో జూన్ 3న 9 సింహాలు కరోనా బారినపడ్డాయి. తాజాగా, మరో నాలుగు సింహాలకు కూడా కరోనా సోకింది. భోపాల్లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ - నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీజెస్(ఐసీఏఆర్-ఎన్ఐహెచ్ఎస్ఏడీ) 11 సింహాల నమూనాలను పరీక్షించింది.
కాగా, వీటిలో నాలుగు సింహాలకు కరోనావైరస్ డెల్టావేరియంట్ లేదా బీ.1.617.2 వేరియంట్ సోకినట్లు తేలింది. కరోనావైరస్ డెల్టావేరియంట్ లేదా బీ.1.617.2 వేరియంట్కి వేగంగా వ్యాప్తి చెందే లక్షణముందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించిన విషయం తెలిసిందే.
మే 24, మే 29 తేదీల్లో అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్లోని 11 సింహాల నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్ ఐసీఏఆర్-ఎన్ఐహెచ్ఎస్ఏడీకి పంపింది. వీటిలో నాలుగు సింహాలకు కరోనా సోకినట్లు పరీక్షల అనంతరం తేలింది. జూన్ 3న 9 సింహాలకు కరోనా సోకగా.. ఇప్పుడు మరో నాలుగింటికీ వ్యాప్తి చెందడంతో మొత్తం 11 సింహాలు కరోనా మహమ్మారి బారినపడినట్లయింది.
ప్రస్తుతం కరోనా బారినపడిన సింహాలకు అవసరమైన వైద్యం అందిస్తున్నట్లు జూ అధికారులు తెలిపారు. కాగా, నీల అనే 9 ఏళ్ల సింహం జూన్ 4న కరోనా లక్షణాలతో మరణించింది. జూన్ 16న 12ఏళ్ల పద్మనాథన్ అనే సింహం ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.