రాష్ట్రపతిగా అద్వానీ తగిన వ్యక్తి: గడ్కరీ, అమితాబ్తో...
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ రాష్ట్రపతి పదవికి అర్హుడు అని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అద్వానీ రాష్ట్రపతి పదవికి అన్నివిధాలా ఎంతో అర్హులని, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన అద్వానీ వల్ల రాష్ట్రపతి పదవి ప్రతిష్ట మరింతగా ఇనుమడిస్తుందన్నారు.
ఇండియా టీవీ చానల్లో రజత్ శర్మ నిర్వహించిన ‘ఆప్ కీ అదాలత్' కార్యక్రమంలో గడ్కరీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అద్వానీ ఇప్పటికే ఉప ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినందున ఆయనను లోకసభ స్పీకర్గా ఎన్నుకుని ఉంటే ఎంతమాత్రం సముచితంగా ఉండేది కాదన్నారు.
తామంతా అద్వానీని ఎంతగానో గౌరవిస్తున్నామని చెప్పారు. మహోన్నత వ్యక్తిత్వం కలిగిన అద్వానీకి తగిన పదవి లభించాలని తాము కోరుకుంటున్నామని, అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి 75 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ నాయకులను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోరాదని ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో వివేకవంతమైన నిర్ణయం తీసుకున్నారని గడ్కరీ తెలిపారట.
75 ఏళ్లకు మించిన వారిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోరాదని గడ్కరీ, మోడీ తీసుకున్న నిర్ణయం కారణంగా సీనియర్ నేతలైన అద్వానీ, జోషీ వంటి వారు కేబినెట్లో స్థానం పొందని విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తరాల మార్పు గురించి గడ్కరీ ఒక పోలిక తెస్తూ బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ అయినా ఇప్పుడు కథానాయకుని పాత్రను పోషించలేరన్నారు.