లాక్డౌన్ విషాదం: 15 రోజులు 1500 కి.మీలు నడిచి.. స్వరాష్ట్రంలో మరణించాడు
లక్నో: కరోనావ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పనులు లేకపోవడంతో సొంత గ్రామాలకు వెళుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ముంబై నుంచి కాలినడకన..
తాజాగా ఓ వ్యక్తి ఏకంగా 15 రోజులపాటు నడిచి క్వారంటైన్లో మృతి చెందిన హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇండో-నేపాల్ సరిహద్దులో ఉండే శ్రావస్తి జిల్లాకు చెందిన ఇన్సాఫ్ అలీ అనే వ్యక్తి ముంబైలో రోజు కూలీగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్తో పనిలేకపోవడంతో కాలినడకన స్వగ్రామానికి బయలుదేరాడు.
15 రోజులు 1500 కిలోమీటర్లు నడక..
అలా ఏకంగా 15 రోజులపాటు 1500 కిలోమీటర్లు నడుచుకుంటూ శ్రావస్తి జిల్లాలోని సొంత గ్రామానికి చేరుకున్నాడు. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని నిబంధనల ప్రకారం మొదట అలీని క్వారంటైన్ తరలించారు అధికారులు. దారిలో తినడానికి నీళ్లు లేక, తిండి దొరక్క ఇబ్బందులు పడినట్లు తెలపడంతో అధికారులు అతనికి ఆహారాన్ని అందించారు.
స్వరాష్ట్రంలోకి క్వారంటైన్లోకి..
ఆ తర్వాత కొద్ది గంటలకే అప్పటికే తీవ్రంగా అలసిపోయిన అతడు ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు. శ్రావస్తి ఎస్పీ అనూప్ కుమార్ సింగ్ ఈ విషయంపై స్పందిస్తూ.. క్వారంటైన్ కేంద్రానికి వచ్చిన అతడికి పరీక్షలు నిర్వహించారని, కొద్ది గంటల తర్వాత పొట్ట పైభాగంలో నొప్పిగా ఉందని, వాంతులు చేసుకున్నాడని తెలిపారు. దీంతో వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించినట్లు చెప్పారు.
క్వారంటైన్లోనే ప్రాణం వదిలాడు..
అలీని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మరణించారని నిర్ధారించారు. పరీక్షల ఫలితాల అనంతరం మృతదేహానికి పరీక్షలు నిర్వహిస్తామని, ప్రాథమిక పరీక్షల్లో అతడికి కరోనా లక్షణాలు కనిపించలేదని వైద్యాధికారి తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1986 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 399 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1556 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
Recommended Video