4 గంటల నుంచే మెట్రో రైలు సర్వీసులు
Delhi Metro: దేశంలో ఆరో విడత పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. ఈ దశలో ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 58 లోక్సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
ఈ దశలో బిహార్- 8, ఢిల్లీ- 7, హర్యానా-10, బిహార్- 5, జమ్మూ కాశ్మీర్- 1, ఒడిశా- 6, ఉత్తరప్రదేశ్- 14, పశ్చిమ బెంగాల్- 8, జార్ఖండ్-4 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయింది. ఈ దశ ఎన్నికల్లో పలువురు కీలక అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.

కేంద్ర మంత్రి దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్.. ఈ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేశారు. న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సోమ్నాథ్ భారతిపై ఆమె పోటీ చేశారు.
ఢిల్లీ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి కన్నయ్య కుమార్.. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనపై బీజేపీ సీనియర్ నేత మనోజ్ తివారీ రంగంలో దిగారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ పోటీలో నిలిచారు.
మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరఫున అనంత్ నాగ్ - రాజౌరి నుంచి, హర్యానాలోని కర్నాల్ నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. గుర్గావ్ నుంచి బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న వారి జాబితాలో ఉన్నారు.
ఈ నెల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ అధికారులు రైలు సర్వీసుల సమయాన్ని సవరించారు. తెల్లవారు జామున 4 గంటలకే అన్ని లైన్లల్లో కూడా మెట్రో రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణంగా ప్రతి రోజూ తెల్లవారు జామున 6 గంటలకు మెట్రో రైల్ సర్వీసులు ఆరంభమౌతాయి.
ఓటింగ్ను దృష్టిలో ఉంచుకుని రెండు గంటలు ముందుగా అంటే 4 గంటలకే అన్ని మార్గాల్లో కూడా సర్వీసులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, ఓటర్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తెల్లవారు జామున 6 గంటల వరకు ప్రతి అరగంటకూ ఓ సర్వీస్ నడిచింది.












Click it and Unblock the Notifications