నల్లధనంపై మరో అడుగు: వారికి టైమిచ్చిన జైట్లీ, మాది తప్పేనని మోడీ
న్యూఢిల్లీ: నల్లధనం విషయంలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికితీస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లధనం కలిగి ఉన్న వారి పైన కొరడా ఝులిపించేందుకు కఠిన బిల్లుకు సోమవారం లోకసభ ఆమోదం తెలిపింది.
అప్రకటిత విదేశీ ఆస్తుల కేసుల్లో భారీగా 120 శాతం మేర పన్ను, జరిమానాతో పాటు పదేళ్ల వరకూ కఠిన కారాగార శిక్షను విధించేందుకు ప్రభుత్వానికి వీలుకలుగుతుంది. అప్రకటిత విదేశీ ఆదాయం, ఆస్తులు (పన్ను విధింపు) బిల్లు-2015ను సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
అప్రకటిత విదేశీ సంపద పైన భారీ జరిమానా విధిస్తారు. పదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. అమాయకులను తాము లక్ష్యంగా చేసుకోమని చెప్పారు. విదేశాల్లో అప్రకటిత ఆదాయం, ఆస్తులు ఉన్న వారు తమ తప్పును సరిచేసుకునేందుకు కొంతకాలం పాటు వెసులుపాటు కల్పించనున్నట్లు చెప్పారు.
ఇలాంటి వారు ముప్పై శాతాన్ని పన్నుగాను, మరో ముప్పై శాతాన్ని జరిమానాగా చెల్లించాలన్నారు. విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని ప్రకటించేందుకు రెండు నెలల గడువు, దానిపై పన్ను, జరిమానా చెల్లింపుకు ఆరు నెలల గడువు తరహాలో ఉండొచ్చన్నారు. ఈ వెసులుబాటు ముగిశాక ఎవరి వద్దనైనా అప్రకటిత ఆస్తులు ఉన్నట్లు తేలితే వారు ముప్పై శాతాన్ని పన్నుగా, 90 శాతాన్ని జరిమానాగా చెల్లించాలన్నారు.
యూపీఏకీ మద్దతుపై మోడీ
కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని హడావుడిగా ఆమోదించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ బిల్లుపై పార్లమెంట్లో వివాదం కొనసాగుతున్న తరుణంలో ఆయన విమర్శలు గుప్పించారు. అప్పట్లో భూసేకరణ చట్టానికి మద్దతు తెలిపి బీజేపీ కూడా తప్పు చేసిందన్నారు.
భూసేకరణ చట్టానికి సంబంధించిన చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, 120 ఏళ్ల తర్వాత గుర్తుకు వచ్చిన ఈ బిల్లును పరిశీలించేందుకు గత యూపీఏ ప్రభుత్వం కనీసం 120 గంటల సమయాన్ని కూడా వెచ్చించలేదని, అందుకు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బాధ్యురాలు కాదని, అప్పట్లో ఈ బిల్లుకు మద్దతు తెలిపి బీజేపీ కూడా తప్పు చేసిందన్నారు.