ఓటర్ ఐడీ-ఆధార్ కార్డుకు లింక్: బోగస్ దొంగ ఓట్లకు చెక్: బిల్లును ఆమోదించిన లోక్సభ: రభస
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా అత్యంత కీలకబిల్లు ఆమోదం పొందింది. ఎన్నికల ప్రక్రియలో ఓ విప్లవాత్మక మార్పుగా భావించే బిల్లు ఇది. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఇది. దొంగ ఓట్లకు అడ్డుకట్ట వేయడానికి, నకిలీ ఓటర్లకు చెక్ పెట్టడానికి ఉద్దేశించిన బిల్లును లోక్సభ ఆమోదించింది. ప్రతిపక్ష సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సభలో ఆందోళన చేశారు. సభా కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటీకీ- బిల్లును సభ ఆమోదించింది.

ఓటర్ ఐడీ-ఆధార్ లింక్ ఇక తప్పనిసరి..
ఓటర్ ఐడీ-ఆధార్ కార్డులను అనుసంధానించడం వల్ల పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉండదనేది ప్రతిపక్షాల వాదన.జాబితాలో డూప్లికేషన్, డబుల్ ఎంట్రీ, నకిలీ ఓటర్లు, బోగస్, దొంగ ఓట్లను గుర్తించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసే ఓటర్ గుర్తింపు కార్డుతో ఆధార్ను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన ముసాయిదాపై ఇదివరకే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మధ్యాహ్నం ఆ ముసాయిదా బిల్లు సభ ముందుకు వచ్చింది.

ప్రజాతీర్పు పక్కదారి..
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు 2 గంటలకు దీన్ని సభలో ప్రవేశపెట్టారు. దీన్ని రూపొందించడానికి గల కారణాలను వివరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకుని వచ్చిన తరువాత కూడా బోగస్ ఓట్లు పెద్ద ఎత్తున పోల్ అవుతున్నాయని పేర్కొన్నారు. దీన్ని నివారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బోగస్ ఓట్ల వల్ల ప్రజాల తీర్పు పక్కదారి పడుతోందని అన్నారు. కోట్లాదిమంది ప్రజల తీర్పును అపహాస్యం చేసినట్టవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

బోగస్ ఓట్లను ఏరివేత కోసమే..
బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ వంటి అవాంఛనీయ సంఘటనలకు అడ్డుకట్ట పడిందని, అదే సమయంలో బోగస్ ఓట్లను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికోసం ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని తాము నిర్ణయించామని చెప్పారు. కోట్లాది మంది దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని కిరణ్ రిజిజు చెప్పుకొచ్చారు. దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల బిల్లులో సవరణలను చేయాల్సి వస్తోందని స్పష్టం చేశారు.

పౌరసత్వం లేని వారికి కూడా ఓటు హక్కు..
ఈ బిల్లు పట్ల కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు అనేది- చిరునామా కోసం మాత్రమే వినియోగించేదని కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ అన్నారు. దేశంలో తమకు పౌరసత్వం ఉన్నట్లుగా నిర్దారించాడానికి జారీ చేసిన గుర్తింపు కార్డు కాదని చెప్పారు. ఆధార్ కార్డుకు ఓటర్ ఐడీని అనుసంధానం చేయడం వల్ల సంబంధిత ఓటర్కు ఉన్న పూర్తి వివరాలు బహిర్గతమౌతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వం లేని వారికి కూడా ఓటు వేసే హక్కు లభిస్తుందని అన్నారు.

బిల్లులో అనేక లోపాలు..
ఈ బిల్లులో న్యాయపరమైన అనేక లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ సభా పక్ష నేత, ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. దీన్ని పరిశీలన కోసం స్థాయీ సంఘానికి పంపించాల్సి ఉందని చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందని స్పష్టం చేశారు. పౌరుల వ్యక్తిగత, సమాచార భద్రత హక్కును లాక్కున్నట్టవుతుందని అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. కోట్లాదిమంది దేశ ప్రజల ఓటు హక్కును కాలరాస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ ఐడీ కార్డుతో అనుసంధానం చేయించుకోలేని వారికి ప్రభుత్వం నుంచి అందుతోన్న ఆర్థిక ప్రయోజనాలు, సంక్షేమ పథకాలను కూడా రద్దు చేయడానికి కారణమౌతుందని అన్నారు.












Click it and Unblock the Notifications